ఇక తప్పదు: జడ్జీలుగా కేంద్రం తిరస్కరించిన పేర్లను తిరిగి పంపిన సుప్రీంకోర్టు కొలీజియం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన ఇద్దరి పేర్లను కేంద్రం తిరస్కరించింది. అయితే తిరస్కరించిన ఈ ఇద్దరి పేర్లను కొలీజియం తిరిగి కేంద్రానికి పంపింది. దీంతో ఆ జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేయడం కేంద్రానికి తప్పనిసరిగా మారింది. వీరితో పాటు కొలీజియం మరో ఇద్దరి పేర్లను కూడా పంపింది. బాంబే హైకోర్టులో ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ , హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్లను కూడా పంపింది.
జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనిరుద్ద బోస్, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బోపన్న పేర్లను సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేస్తూ తొలుత రికమెండ్ చేస్తూ కేంద్రానికి పంపింది కొలీజియం. అయితే కేంద్రం వీరిద్దరినీ తిరస్కరిస్తూ తిరిగి కొలీజియంకు పంపింది. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తమ అభిప్రాయాన్ని తెలిపింది. అయితే కొలీజియం మాత్రం కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. భారత దేశంలో జడ్జీల సీనియారిటీ ప్రకారం జస్టిస్ బోస్ 12 వ స్థానంలో ఉన్నారు. ఇక జస్టిస్ బోపన్న సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.
కేంద్రం సుప్రీంకోర్టు కొలీజియంల మధ్య జడ్జీల ఎంపికలో బేధాభిప్రాయాలు రావడం ఇది తొలిసారి కాదు. గతేడాది ఏప్రిల్లో కూడా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకాన్ని కొలీజియం సూచించగా కేంద్రం ఫైలును తిరిగి వెనక్కు పంపింది. సీనియార్టీలో జస్టిస్ కేఎం జోసెఫ్ లేరని కేంద్రం పేర్కొంది. అయితే జూలైలో తిరిగి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును ప్రతిపాదించింది కొలీజియం. దీంతో తప్పని పరిస్థితుల్లో కేంద్రం సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేరుకు ఆమోదం తెలపాల్సి వచ్చింది.