సుప్రీం తీర్పు ఆధార్కు అనుకూలమే, రహస్యంగా వ్యవహరించడమే మంచిదైంది: జైట్లీ
వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు తీర్పు ఆధార్కు అనుకూలంగానే ఉందని భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్: సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యత హక్కును కాపాడుతునే కొన్ని మినహాయింపులు ఇచ్చిందని, అవి ఆధార్కు అనుకూలంగానే ఉన్నాయని భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.
న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆధార్పై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఏమిటని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సుప్రీంకోర్టు సరయిన తీర్పే ఇచ్చిందని, ఆధార్ను పరిరక్షించేలా సరైన మినహాయింపులే ఇచ్చిందని చెప్పారు. మొదటి మినహాయింపు జాతీయ భద్రతకు సంబంధించినదని, రెండోది నేర పరిశోధన, నివారణ విషయమై ఇచ్చిందని, మూడోది సామాజిక-ఆర్థిక ప్రయోజనాల పంపిణీ కోసం ప్రస్తావించిందని వివరించారు.
మూడో మినహాయింపు 'ఆధార్'కు అనుకూలంగా ఉందని, వ్యక్తిగత సమాచార రక్షణ కోసం అనుసరించాల్సిన మార్గాలు, వాటిని ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆధార్ చట్టంలోనే ప్రత్యేక అధ్యాయం ఉందని, ఇవన్నీ అమల్లోకి వస్తాయని జైట్లీ చెప్పారు.
అలా చేసి ఉంటే అవినీతి జరిగుండేది...
నోట్ల రద్దుపై రహస్యంగా వ్యవహరించడమే మంచిదయిందని, పారదర్శకత పాటించి ఉంటే అవినీతికి ఆస్కారం కలిగి ఉండేదని అరుణ్ జైట్లీ అన్నారు. పారదర్శకత మంచిదేనని, కానీ నోట్లరద్దు వంటి విషయానికి అది వర్తించదని చెప్పారు.
నోట్లు రద్దు చేస్తామని ముందుగా ప్రకటించి ఉంటే నల్లధనంతో భూములు, బంగారం కొనుగోలు చేసి ఉండేవారని అన్నారు. రహస్యంగా ఉంచడం వల్లనే ఈ పథకం విజయం సాధించిందని చెప్పారు.
నోట్ల రద్దు ప్రకటనకు ముందుగానే పెద్ద సంఖ్యలో కొత్త నోట్లు ముద్రించామని, అలా ఎందుకు చేస్తున్నామో ముద్రించిన వారికి కూడా తెలియదని ఆర్థిక మంత్రి చెప్పారు. అంతేకాదు, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎక్కడా ప్రజాందోళనలు కూడా చోటు చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు, జీఎస్టీవంటి సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే కాలంలో మరింత స్వచ్ఛమైన, విస్తృతమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు.