ఢిల్లీ అల్లర్లలో ఊహించని మలుపు.. పోలీసులపై సుప్రీం మెరుపుదాడి.. ‘ఔట్ ఆఫ్ బాక్స్’ ఆగమాగం..
దేశరాజధాని ఢిల్లీలో గత నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా హింస కొనసాగుతుండటం.. అల్లర్లలో రెండు మతాలకు చెందిన పౌరులు ప్రాణాలు కోల్పోతుండటం.. అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటం.. ఇంత జరుగుతున్నా పోలీసులు పత్తా లేకుండా పోవడం.. తదితర అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మోదీ సర్కారు పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులపై మెరుపుదాడి తరహాలో సుప్రీంకోర్టు నిప్పులుచెరిగింది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్బాగ్లో గత రెడు నెలలుగా కొనసాగుతోన్న ధర్నాను.. వేరొక చోటికి తరలించాలన్న పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించింది. షాహీన్ బాగ్ ధర్నా, ప్రస్తుత హింసకు సీఏఏనే నేపథ్యంగా ఉండటం, ప్రస్తుతం దేశరాజధానిలో పరిస్థితి చాలా దారుణంగా తయారరైన కారణంగా ధర్నా చౌక్ తరలింపుపై ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పలేమని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ఈ వివాదాన్ని విచారించింది.
ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచన..
‘‘సీఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం, నిరసనకారుల వాదనలు వేటికవే భిన్నంగా ఉన్నాయి. దేనిమీదైనా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉంది. కానీ దానివల్ల మిగతా ప్రజలు ఇబ్బంది పడొద్దు. ధర్నా పేరుతో రెండు నెలలుగా రోడ్లు బ్లాక్ చేయడం సరికాదు. ఈ వివాదానికి న్యాయపరంగా కచ్చితమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉంది. కాబట్టే మేము ‘ఔట్ ఆఫ్ బాక్స్' ఆలోచించి.. మధ్యవర్తుల్ని నియమించాం. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా, ఫెయిలవుతుందా అనేది పక్కనపెడితే.. పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మావంతు ప్రయత్నం చేశాం. కానీ ఇలాంటి ప్రయత్నం పోలీసులవైపు నుంచి జరగలేదు.. ''అని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు.
పోలీసుల ఫెయిల్యూర్..
ఢిల్లీ పోలీసులుగానీ సకాలంలో స్పందించి ఉంటే.. చట్టప్రకారం పనిచేసి ఉంటే ఇవాళ 20 మంది ప్రాణాలు పోయేవికావని, ఆస్తుల ధ్వంసం జరిగిఉండేది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘కచ్చితంగా సమస్యంతా ఢిల్లీ పోలీసుల దగ్గరే ఉంది. ఒక్కరు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోలేదు. స్వతంత్ర నిర్ణయాలు అసలేలేవు. పక్కనే నిలబడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినవాళ్లను కూడా పోలీసులు పట్టుకోలేదు. అలాంటప్పుడు పరిస్థితి దిగజారకుండా ఉంటుందా?''అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు.
మధ్యవర్తుల రిపోర్టును వెల్లడించం..
సీఏఏ నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో షాహీన్ బాగ్ ధర్నా కేంద్రం తరలింపుపై ఇప్పుడప్పుడే తీర్పు చెప్పలేమని, పరిస్థితులు చక్కబడ్డాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వానికిగానీ,ఢిల్లీ పోలీసులకుగానీ ఇప్పుడే ఇవ్వబోమని స్పష్టం చేసింది. మొత్తంగా విచారణను మార్చి 23కు వాయిదా వేసింది.
గంటగంటకూ పెరుగుతోంది..
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గొడవలు జరగడంలో ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హింస ప్రజ్వరిల్లింది. బుధవారం నాటికి మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోకి అంబులెన్స్ లను కూడా రానివ్వకపోవడం గమనార్హం. పరిస్థితిపై కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నది. అదనపు బలగాల మోహరింపునకు ఆదేశాలిచ్చింది.