రంగు మారుతన్న తాజ్మహల్: గోధుమ, ఆకుపచ్చ వర్ణాల్లోకి
న్యూడిల్లీ: తాజ్మహల్ రంగు మారుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం గోధుమ, ఆకుపచ్చ రంగుల్లోకి ఈ కట్టడం మారిపోతోంది. ఈ విషయమై మీరేం చేస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
తాజ్మహల్ రంగు మారడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆందోళనను వ్యక్తం చేసింది. గతంలో తాజ్మహల్ పసుపురంగులోకి మారింది. ప్రస్తుతం ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోకి మారుతోంది. ఈ విషయమై విదేశీ నిపునుల సహయం తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది.
ఏ మేరకు నష్టం జరిగిందనే విషయాన్ని అంచనా వేయాలని సుప్రీంకోర్టు సూచించింది. చారిత్రక కట్టడం పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మీ దగ్గర నిపుణులు ఉన్నారో లేదో మాకు తెలియదు. ఒకవేళ ఉండి ఉండే మీరు సరిగా ఉపయోగించుకోవడం లేదు. లేదా మీకు ఎలాంటి పట్టింపు లేకపోవడం కూడా కావచ్చు అని న్యాయమూర్తులు ఎంబీ లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ కేంద్రాన్ని తప్పుపట్టింది.
పిటిషనర్ ఎంసీ మెహతా కోర్టుకు సమర్పించిన తాజ్మహల్ ఫోటోగ్రాఫ్ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎ.ఎన్.ఎస్.నాదకర్ణిని ఉద్దేశించి 'తాజ్ మహల్ రంగులు ఎందుకు మారుతోందో మీకు తెలుసా' అని ప్రశ్నించింది. తాజ్మహల్ నిర్వహణ ఆర్కియాలిజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసుకుంటోందని నాదకర్ణి కోర్టుకు తెలిపారు. దీంతో దేశ, విదేశీ నిపుణుల సాయం తీసుకుని నష్టం అంచనా వేయాలని, తాజ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని బెంచ్ ఆదేశిస్తూ... తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది.