అయోధ్య కేసుపై నేటి నుంచి రోజువారీ విచారణ
ఢిల్లీ : రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదం కేసు విచారణ వేగవంతం కానుంది. ఇవాళ్టి నుంచి కేసుపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టనుంది. మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా సమస్య పరిష్కరించాలని భావించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆగస్టు 1న త్రిసభ్య కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ప్యానెల్ ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి అయోధ్య కేసును రోజువారీ విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది.
అయోధ్య భూవివాదంలో రెండు వర్గాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కోసం మార్చి 8న సర్వోన్నత న్యాయస్థానం మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ కలిఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్నారు. అన్ని వర్గాలతో చర్చించి ఆగస్టు 1న నివేదికను సమర్పించాల్సిందిగా మధ్యవర్తిత్వ కమిటీని జులై 18న సుప్రీం ఆదేశించింది. దీంతో ప్యానెల్ సీల్డ్కవర్లో నివేదికను సమర్పించారు . మరుసటి రోజు నివేదిక పరిశీలించిన న్యాయస్థఆనం .. దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ ఇరు వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపినా.. ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించడంలో విఫలమైందని అభిప్రాయపడింది.
వాస్తవానికి మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంపై పిటీషనర్ గోపాల్ సింగ్ విశారద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్యానెల్ ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో రోజువారీ విచారణ జరపాలని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం త్రిసభ్య కమిటీ ఆగస్టు 1కల్లా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ రిపోర్టు సమర్పించగా.. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం మధ్యవర్తిత్వం విఫలమైందని తేల్చింది. 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది నవంబర్ 17న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ కానున్నారు. ఈ లోగా ఆయన కేసు విచారణ పూర్తి చేసి తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.