సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా రాదా: మరో కీలక తీర్పుకు సుప్రీంకోర్టు సిద్ధం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందేలోపు పలు కీలక తీర్పులు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 17తో ఆయన పదవీకాలం ముగియనుండటంతో ఇప్పటికే అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పును వెల్లడించారు. ఇక బుధవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా రాదా అనే పిటిషన్పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. ఏప్రిల్లో ముగిసిన వాదనలపై తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం.
2007లో ఆర్టీఐ కింద అర్జీ పెట్టుకున్న సుభాష్ చంద్ర అగర్వాల్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును జనవరి 2010లో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ .నవంబర్ 2007లో ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ జడ్జీలకు సంబంధించిన ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ సుప్రీంకోర్టులో సమాచారచట్టం హక్కు కింద దరఖాస్తు చేశారు. అయితే సమాచారం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.దీంతో అగర్వాల్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ సీఐసీ సర్వోన్నత న్యాయస్థానంను కోరింది. పారదర్శకత చట్టం కింద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా వస్తుందని పేర్కొంది.
సీఐసీ ఆదేశాలతో ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు
2009 జనవరిలో సీఐసీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐకి జడ్జీల ఆస్తుల వివరాలు తెలపడం సరికాదని అది వారి వ్యక్తిగతం అని పేర్కొంది. అంతేకాదు అతిపారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 2, 2009న ఏకసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టుకు షాకిస్తూ జడ్జీల ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే అంటూ సీఐసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏకసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ డివిజెన్ బెంచ్ను ఆశ్రయించింది. ఇక ఇక్కడ కూడా చేదు అనుభవమే ఎదురుకావడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ రాజ్యాంగ ధర్మాసనంలో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది.
కేసు తొలి నుంచి చివరి వరకు...
ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ నవంబర్ 2007లో జడ్జీల ఆస్తులు తెలపాలంటూ సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. అయితే సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సీఐసీని ఆశ్రయించారు. సీఐసీ అగర్వాల్కు అనుకూలంగా వ్యవహరించింది. సీజేఐ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని వెల్లడించింది. జనవరి 2009లో సీఐసీపై సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐసీకి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. అక్కడ కూడా త్రిసభ్య ధర్మాసనం సీజేఐ ఆర్టీఐ పరిధిలోకే వస్తుందని తీర్పు చెప్పింది. అక్కడ చుక్కెదురు కావడంతో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోసుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది.
మొత్తానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుందా లేదా అనేదానిపై బుధవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు ఇవ్వనున్నారు.