జ్ఞానవాపి మసీదు వివాదం-వారణాసి కోర్టుకు సర్వే రిపోర్ట్-తీర్పు ఇవ్వొద్దంటూ సుప్రీం బ్రేక్
జ్ఞానవాపి మసీదు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలో ఇప్పటికే సర్వే జరిపిన ప్రత్యేక బృందం తమ నివేదికను వారణాసి కోర్టుకు సమర్పించింది. దీంతో ఈ నివేదికను పరిశీలించి తీర్పు ఇచ్చేందుకు సిద్దమవుతున్న వారణాసి కోర్టును సుప్రీంకోర్టు ఇవాళ నిలువరించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుపై విచారణ జరుపుతామని, అప్పటివరకూ ఎలాంటి ఆదేశాలూ ఇవ్వొద్దని వారణాసి కోర్టును కోరింది.
వారణాసి కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ప్రత్యేక సర్వే బృందం మూడు రోజుల పాటు జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించింది. అయితే ఇందులో మధ్యలో శివలింగం బయటపడిదంటూ మీడియాకు సమాచారం ఇచ్చిన సర్వే బృందం సభ్యుడొకరిని కోర్టు ఈ వ్యవహారం నుంచి తప్పించింది. మిగతా బృందం తమ సర్వే పూర్తి చేసి ఇవాళ వారణాసి కోర్టుకు సమర్పించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు వారణాసి కోర్టు కూడా సిద్ధమైంది. అంతలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
జ్ఞానవాపి మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం .. సర్వే నివేదికపై వారణాసి కోర్టు ఇవాళ ఆదేశాలు ఇస్తే మొత్తం కేసుపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తాము విచారణ చేపడతామని, ఆ లోపు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని వారణాసి కోర్టుకు సూచించింది. దీంతో వారణాసి కోర్టులోనూ విచారణకు బ్రేక్ పడింది.
జ్ఞాన్వాపి మసీదు కేసును సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. వారణాసి కోర్టులో విచారణను కూడా కోర్టు నిలిపివేయడానికి కీలక కారణాలు కనిపిస్తున్నాయి. వారణాసి కోర్టు ఆ ప్రాంతాన్ని మూసివేయాలని ఆదేశించిన నేపథ్యంలో, 'శివలింగం' కనిపించిందని చెప్పబడుతున్న వజుఖానా ధ్వంసం చేస్తారనే భయంతో సుప్రీంకోర్టు ఈ చర్య తీసుకుంది. వారణాసి అధికారులు రిజర్వాయర్ ఉన్న జ్ఞాన్వాపి మసీదు ప్రాంతాన్ని మూసివేసింది. దీనిలో ఒక సర్వే సమయంలో శివలింగం కనుగొనబడినట్లు సర్వే అధికారి లీక్ ఇచ్చారు. అధికారులు మే 18న ఆ ప్రాంతానికి వెళ్లే తలుపులకు తాళాలు వేసి వాజుఖానాను అందరికీ నిషేధించారు. జ్ఞాన్వాపి మసీదు-కాశీ విశ్వనాథ్ ఆలయ సముదాయం వద్ద శాంతిభద్రతల పరిస్థితిని నివారించడానికి, సీఆర్పీఎఫ్ సిబ్బంది వజుఖానా తలుపుల వద్ద మోహరించారు. క్యాంపస్లో భద్రతను డిప్యూటీ ఎస్పీ-ర్యాంక్ అధికారి, సిఆర్పిఎఫ్ కమాండెంట్ పర్యవేక్షిస్తున్నారు.