Sabarimala: అయ్యప్ప సన్నిధిలో మహిళల ప్రవేశం: ఏడు కాదు.. తొమ్మిది: సుప్రీంలో.. కాస్సేపట్లో..!
న్యూఢిల్లీ: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాల్సిన అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కాస్సేపట్లో విచారణ చేపట్టబోతోంది. ఆలయంలోనికి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై హిందువుల, ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం, పదుల సంఖ్యలో రివ్యూ పిటీషన్లు దాఖలు కావడం వంటి పరిణామాల మధ్య తన తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించబోతోంది.
గత ఏడాదే తుది తీర్పును వెలువడించాల్సి ఉన్నా..
నిజానికి- గత ఏడాది సెప్టెంబర్లో అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై తీర్పు ఇచ్చిన తరువాత.. శబరిమలపైనా సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉండగా.. వాయిదా పడింది. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై దాఖలైన మొత్తం 69 పిటీషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్. ఆ తరువాత.. ఈ పిటీషన్పై బెంచ్ మారిపోయింది.
ఏడు కాదు తొమ్మిది మంది
ఏడుమంది సభ్యులు గల విస్తృత ధర్మాసనానికి శబరిమల రివ్యూ పిటీషన్లను బదిలీ చేసినప్పటికీ.. ఆ తరువాత ఈ సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులు గల విస్తృత ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్పై విచారణ చేపట్టనుంది. విచారణ ముగిసిన వెంటనే తీర్పును వెలువడిస్తుందా? లేదా రిజర్వ్లో ఉంచుతుందా? అనేది ఆసక్తికర పరిణామం. శబరిమల ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పించాలంటూ ఇదివరకు మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లను కొట్టేయడం.. తుది తీర్పుపై ప్రభావం చూపే అవకాశాలు లేవని అంటున్నారు.
విస్తృత ధర్మాసనం న్యాయమూర్తులు వీరే..
శబరిమల ఆలయంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై విచారణ చేపట్టే ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె సారథ్యాన్ని వహిస్తారు. ఆయనతో పాటు జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. ఇదివరకు ఇదే ధర్మాసనంలో ఉన్న అబ్దుల్ నజీర్ ఈ సారి కూడా కొనసాగుతున్నారు.