సుప్రీంకోర్టుకు సజ్జన్నార్: ఎన్ కౌంటర్ పై పిల్.. రేపే విచారణ: చీఫ్ జస్టిస్ సహా త్రిసభ్య ధర్మాసనం..!
న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజా వ్యాజ్యం (పిల్).. బుధవారం విచారణకు రానుంది. ఈ ఎన్ కౌంటర్ కు దిశా నిర్దేశం చేసినట్లుగా భావిస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ స్వయంగా విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు సభ్యుల ధర్మాసనం..
ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిల్ పై విచారణ నిర్వహించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డె, ఎస్ అబ్దుల్ సత్తార్, సంజీవ్ ఖన్నా దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఈ కేసు లిస్టింగ్ అయింది. దీనికి నంబరింగ్ ను కేటాయించారు. రిట్ పిటీషన్ (క్రిమినల్) నంబర్: 000348/2019 అనే నంబర్ ను ఇచ్చారు. ఉదయమే ఈ కేసు విచారణ ఆరంభం కావచ్చని అంటున్నారు. జీఎస్ మణి అనే వ్యక్తి ఈ పిటీషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సహా
ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నోటీసులను జారీ చేసింది. దీనితో పాటు- తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్, వీసీ సజ్జన్నార్ లను ప్రతివాదులుగా చేర్చారు. సజ్జన్నార్ తో సీబీఐ, సిట్, సీఐడీ అధికారులు సైతం విచారణకు హాజరు కావచ్చని తెలుస్తోంది. ప్రత్యేకించి- సజ్జన్నార్ ద్వారా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు.
చట్టబద్ధమా? కాదా?
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చట్టబద్ధమా? కాదా? అనే కోణంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఎలాంటి పరిస్థితులు, కారణాల మధ్య నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందనే విషయంపై హైదరాబాద్ పోలీసులు.. సుప్రీంకోర్టుకు సహేతుకమైన కారణాలను వివరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం దీనిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో.. దీన్ని కూడా ఇందులో విలీనం చేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉందని చెబుతున్నారు.