మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణ
మహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్ను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన దంపతులు దాఖలు చేశారు. దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించి నమాజ్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇలా మహిళలను మసీదులోకి అనుమతించకపోవడమంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పిల్లో పేర్కొన్నారు.
ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్లో కూడా మహిళలను మసీదుల్లోకి అనుమతించకూడదని ఎక్కడా పేర్కొనబడలేదని తెలిపారు. ఇది మహిళల మనోభావాలను కించపరచడమే కాదు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కూడా అవుతుందని వారి తరుపున లాయర్ అశుతోష్ దూబే అన్నారు. మహిళలకు పురుషులకు సమాన హక్కులు కలిగి ఉన్నారని అశుతోష్ దూబే అన్నారు.
ప్రస్తుతం జమాత్-ఈ-ఇస్లామి మరియు ముజాహిద్ సెక్ట్కు చెందిన మహిళలకు మాత్రమే మసీదులో నమాజ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే సున్నీ వర్గం వీరు నమాజ్ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఒకవేళ మహిళలను మసీదుల్లోకి అనుమతించిన పురుషులకు మహిళలకు వేర్వేరు ప్రవేశద్వారాలు పెడుతున్నారని పిల్లో పేర్కొంది. అంతేకాదు వారి వాదనను బలం చేకూర్చేందుకు ఈ మధ్య సుప్రీంకోర్టు శబరిమలై తీర్పును ప్రస్తావించారు.