ఉన్నావ్ ఘటనపై సుప్రీంకోర్ట్ సీరియస్.. నాలుగు కేసులు ఢిల్లీకి బదిలీ చేస్తామన్న సీజేఐ..
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసును సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అత్యాచార ఘటన, తాజాగా బాధితురాలి ప్రమాదానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే నిందితుడైనందున కేసు విచారణ ఉత్తర్ప్రదేశ్లో సజావుగా సాగకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉన్నావ్ ఘటనకు సంబంధించిన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి సంబంధించి దాఖలైన పిటీషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమకు రక్షణ కల్పించాలంటూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కు రాసిన లేఖను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఉన్నవ్ బాధితురాలిని రేప్ అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్,ఆయన బంధువులు సహా 9మందిపై సీబీఐ కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి సీబీఐను నివేదిక కోరింది.
కేసు విచారణలో భాగంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ప్రస్తుతం లక్నోలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. మధ్యాహ్నం 12గంటల్లోగా కోర్టు ముందు హాజరుకావడం అసాధ్యమని సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తికి చెప్పారు. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. అయితే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించింది. సీబీఐ డైరెక్టర్ సదరు అధికారితో ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకోవచ్చని సూచించింది. సీబీఐ అధికారి ఇచ్చే వివరాల ఆధారంగా ఉన్నావ్ బాధితురాలికి సంబంధించిన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.