రూ.కోటి 17 లక్షల పాత నోట్లు: బ్యాంకులో ఎందుకు జమ చేయకూడదు: కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. 1000 రూపాయలు, పాత 500 రూపాయల నోట్లు మాయం అయ్యాయి. పాత నోట్లు ఎక్కడా కనిపించట్లేదు. దాదాపు 98 శాతానికి పైగా పాత నోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు రిజర్వుబ్యాంకు సైతం వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పాత నోట్లు వెలుగులోకి వచ్చాయి. లక్ష కాదు.. రెండు లక్షలూ కాదు. ఏకంగా కోటి 17 లక్షల రూపాయల పాత నోట్లు. వాటిని తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రద్దయిన పాత నోట్లను బ్యాంకులో జమ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. దీనికి సంబంధించిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.
సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: కాశ్మీర్ కు ఆర్మీ చీఫ్: పాక్ కళ్లన్నీ ఆయన టూర్ మీదే
ఈ పిటీషన్ పై విచారణ అనంతరం సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకునకు నోటీసులను జారీ చేసింది. రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో ఎందుకు జమ చేయకూడదో తెలియజేయాలని, సరైన కారణాన్ని వివరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూచించారు. ఈ పిటీషన్ ను దాఖలు చేసిన వ్యక్తి ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ముంబై చెందిన ఓ ప్రముఖ వ్యాపారిగా అనుమానిస్తున్నారు. కోటి 17 లక్షల రూపాయల 1000, 500 రూపాయల నోట్లు ఆయన వద్ద ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆ రద్దయిన పాత నోట్లను ఆయన బ్యాంకుల్లో జమ చేయలేకపోయారట.
గడువు తీరిన అనంతరం వాటిని జమ చేసుకోవడానికి బ్యాంకర్లు నిరాకరించారు. దీనితో హైకోర్టును ఆశ్రయించగా.. సానుకూల ఫలితం రాలేదు. విధానపరమైన నిర్ణయం కావడం వల్ల హైకోర్టు బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేకపోయిందని అంటున్నారు. దీనితో ఆ వ్యాపారి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రద్దయిన పాత నోట్లు ఎంత మొత్తంలో తన వద్ద ఉన్నది? రెండున్నరేళ్ల తరువాత కూడా వాటిని బ్యాంకులో జమ చేయలేకపోవడానికి గల కారణాలను ఆయన ఈ పిటీషన్ లో వివరించినట్లు చెబుతున్నారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ ఉదయం ఈ పిటీషన్ బెంచ్ మీదికి వచ్చింది. పిటీషనర్ తరఫు న్యాయవాది వాదనలను విన్న అనంతరం- సుప్రీంకోర్టు కేంద్రానికి, రిజర్వుబ్యాంకునకు నోటీసులు జారీ చేసింది. ఇంత పెద్ద మొత్తాన్ని బ్యాంకుల్లో ఎందుకు జమ చేసుకోకూడదో సహేతుక కారణాలను వివరించాలని ఆదేశించింది.