బ్రేక్ పడుతుందా.. లైన్ క్లియర్ అవుతుందా... 'సెంట్రల్ విస్టా'పై నేడు సుప్రీం కీలక తీర్పు...
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్,దినేశ్ మహేశ్వరి,సంజీవ్ కన్నా నేత్రుత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం(జనవరి 5) ఉదయం 10.30గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గతేడాది నవంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది.
సెంట్రల్ విస్టా: అసలేంటీ ప్రాజెక్టు... ఏం నిర్మించనున్నారు... ఇందులో హైలైట్స్ ఏంటి..
Recommended Video
ఈ అంశాలపై పిటిషన్లు...
ప్రాజెక్టు భూ వినియోగంలో చట్ట విరుద్దమైన మార్పులు,వారసత్వ సంపద పరిరక్షణ నియమాల ఉల్లంఘన, డిజైన్,పర్యావరణ అనుమతులు తదితర అంశాలను లేవనెత్తుతూ సుప్రీం కోర్టులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై వేలాది పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్ 10న ప్రాజెక్టు శంకుస్థాపనకు అనుమతినిచ్చిన సుప్రీం కోర్టు... నిర్మాణాలకు మాత్రం బ్రేక్ వేసింది. సుప్రీం తీర్పు వచ్చేంతవరకూ అక్కడ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు గానీ భవనాల కూల్చివేత గానీ చెట్ల నరికివేత గానీ చేపట్టరాదని ఉత్తర్వులు ఇచ్చింది.
కేంద్రం ఏమంటున్నది...
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వానికి రూ.1వెయ్యి కోట్లు ఆదా అవుతుందని గతంలో కేంద్రం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మంత్రిత్వ శాఖలకు అద్దె రూపంలో చెల్లిస్తున్న డబ్బు దీని ద్వారా ఆదా అవుతుందని చెప్పింది. పైగా ఇప్పుడున్న పార్లమెంట్ భవనం 100 ఏళ్ల పాతది అని... అది శిథిలావస్థకు చేరువవుతోందని పేర్కొంది. భద్రతా పరంగా కూటి పాత పార్లమెంటు భవనంలో చాలా సమస్యలు ఉన్నాయని... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి పూనుకున్నామని స్పష్టం చేసింది.
కీలకంగా మారనున్న తీర్పు...
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును 2024 నాటికి,ఇందులో నూతన పార్లమెంట్ భవన సముదాయాన్ని 2022 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సకాలంలో ఈ పనులు పూర్తవాలంటే కోర్టు చిక్కుల నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు సుప్రీం వెలువరించనున్న తీర్పు ఇందులో కీలకంగా మారనుంది. ఒకవేళ కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.
ప్రాజెక్టు నిర్మాణం ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలోని లుట్యెన్స్ జోన్లో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేయనున్నారు. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం,కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3కి.మీ రాజ్పథ్ పునరుద్దరణ చేపట్టనున్నారు.
అలాగే పలు నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు.