విడాకులు మంజూరు చేసే క్రమంలో ఆరునెలల సమయం అవసరం లేదు: సుప్రీంకోర్టు
Recommended Video
ఢిల్లీ: వివాహమైన జంట ఏదైనా కారణాల చేత విడిపోయి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలంటే కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కోర్టు వారిద్దరూ ఆవేశంతో నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తూ మళ్లీ మనసు మార్చుకుని కలిసి కాపురం చేస్తారేమో అనే ఆశతో ఆరునెలల సమయం ఇచ్చేది. అప్పటికీ ఇద్దరూ విడాకులే కావాలని కోరితే విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు. తాజాగా సుప్రీం కోర్టు ఆ సరైన కారణాలతో విడిపోతున్నారంటే ఆరునెలల సమయం అవసరం లేదని తీర్పునిచ్చింది.
విడాకుల మంజూరుకు ఆరునెలల సమయం అవసరం లేదు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి విడాకులు మంజూరు చేయొచ్చని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ ఎకే కౌల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. పైళ్లైన దంపతులు కొన్ని కారణాల చేత సహృధ్భావ వాతావరణంలో స్నేహితులుగా విడిపోయేందుకు తాము చూపిన కారణాలతో న్యాయస్థానం సంతృప్తి చెందితే విడాకులు మంజూరు చేయొచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీం కోర్టుకు ఈ ప్రత్యేక అధికారాన్ని కల్పిస్తోంది.
కారణాలతో న్యాయస్థానం సంతృప్తి చెందితే విడాకులు మంజూరు చేయొచ్చు
దంపతులు ఇద్దరు న్యాయస్థానం ముందు హాజరయ్యారని వారు బాగా చదువుకున్నవారని చెప్పిన ధర్మాసనం వారితో చాలాసేపు మాట్లాడి చర్చించాక ఆరునెలల సమయం అవసరం లేదన్న భావనకు వచ్చినట్లు ధర్మాసనం తెలిపింది. దంపతులుగా ఉండి స్నేహితులుగా విడిపోయేందుకు వారు చూపిన కారణాలతో తాము ఏకీభవిస్తున్నందునే ఆరునెలల సమయం పాటు వేచిచూడకుండా తక్షణమే విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అంతేకాదు కోర్టుకు రాకముందే వారిద్దరి మధ్య ఒక రాజీ కుదిరిందని పేర్కొంది. ఈ క్రమంలోనే భర్త భార్యకు రూ.12 లక్షల 50 వేలు చెల్లించారని..దీంతో భార్య తృప్తి చెంది విడాకులకు అంగీకారం తెలిపిందని కోర్టు వెల్లడించింది.
కేసు పూర్వాపరాలు
2016లో ఈ జంట వివాహం ద్వారా దంపతులుగా మారారు. అనంతరం ఒక నెలపాటు కలిసి కాపురం చేశారు. భార్యాభర్తల మధ్య కొన్ని విబేధాలు తలెత్తడంతో ఇద్దరూ వేరయ్యారు. అనంతరం భర్త విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాదు భార్య కూడా గుజరాత్లోని ఆనంద్లో భర్తపై 2017 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. ఆ తర్వాత పిటిషన్ను సుప్రీం కోర్టుకు బదిలీ చేయించుకుంది. ఈ క్రమంలోనే కేసును విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం దంపతులిద్దరూ పరస్పర అవగాహన, అంగీకారంతోనే విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువడించింది సుప్రీంకోర్టు.