హదియా వివాహాన్ని కేరళ హైకోర్టు గుర్తించలేదా?: సుప్రీం
న్యూఢిల్లీ: కేరళలో నమోదైన లవ్ జిహాద్ కేసు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హదియా కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిగింది కాదా? అని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. అలా జరిగిన తర్వాత కూడా ఇష్ట పూర్వకంగా హదియా-షఫిన్ చేసుకున్న వివాహాన్ని కేరళ హైకోర్టు గుర్తించలేదా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
తమ కూతురు వివాహం చేసుకున్న వ్యక్తి సరైన వాడు కాదని, ఆమెను మోసగించి ముస్లిం వ్యక్తి వివాహం చేసుకున్నాడని అమ్మాయి తండ్రి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. 'ఆమె(హదియా) ఇష్టపూర్తిగా చేసుకున్న వివాహంపై మేం ఎలాంటి వ్యాఖ్య చేయలేము. అది సరైన నిర్ణయమా కాదా అని మేం నిర్ణయించలేం. కేవలం మీరు చెబుతున్న ఆరోపణల ద్వారా ఆమె చేసుకున్న వ్యక్తి సరైన వాడు కాదని అనలేము. పెళ్లి చేసుకున్న అమ్మాయిని పిలిచి అడిగినప్పుడు తాను ఇష్ట పూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఆమె చెబుతున్న మాటలు నిజమైనవా కాదా అని మనం ఎలా చెప్పగలం. అలాగని ఆమె నిర్ణయాన్ని కూడా తప్పుబట్టడం కోర్టుకు సాధ్యం కాదు' అని కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం హదియా కేసు విచారణ సందర్బంగా ఈ మేరకు స్పందించింది. ఈ కేసులో ఇద్దరు మైజర్లైన యువతీ, యువకులు వారి అవగాహన మేరకే వివాహాన్ని చేసుకున్నారు కదా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. దీనిపై పూర్తి స్థాయి విచారణ అవసరమని పేర్కొంది. కేరళ హైకోర్టు వీరి వివాహాన్ని పూర్తిగా వ్యతిరేకించిందా? అని ప్రశ్నించింది.
వివాహం, విచారణ రెండు వేర్వేరు పార్శ్యాలని, వివాహం జరిగింది కాబట్టి.. విచారణ కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై జరపాల్సి ఉందని కోర్టు పేర్కొంది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది. హదియాను ప్రేమ పేరుతో షఫిన్ జహాన్ లోబర్చుకుని, మతం మార్చి వివాహం చేసుకున్నాడని ఆమె తండ్రి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, 25ఏళ్ల హదియా.. తాను తనకు ఇష్టపూర్వకంగానే షఫిన్ జహాన్ను వివాహం చేసుకున్నాని, ముస్లిం మతంలోకి మారానని మంగళవారం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. తాను ముస్లింగానే కొనసాగుతానని కూడా హదియా(అఖిలా అశోకన్) స్పష్టం చేసింది.