సుప్రీంకోర్టు: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై స్టాండప్ కమేడియన్ కుణాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి తెరతీశాయి.
కుణాల్పై ''కోర్టు ధిక్కరణ'' చర్యలు తీసుకునేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆమోదం తెలిపారు. దీంతో కోర్టు ధిక్కరణ ప్రక్రియపై చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రక్రియలను ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపణలతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడాన్ని కూడా కోర్టు ధిక్కరణ కిందే పరిగణలోకి తీసుకోవాలని అటార్నీ జనరల్ను ఇటీవల ఓ న్యాయవాది కోరారు. అయితే ఆ అభ్యర్థనను అటార్నీ జనరల్ తిరస్కరించారు.
ఇంతకీ కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) అంటే ఏమిటి? దీని కింద ఎప్పుడు చర్యలు తీసుకోవచ్చు? ఎలాంటి శిక్షలు విధిస్తారు?
కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? దీనికి సంబంధించిన చట్టాలు ఏం చెబుతున్నాయి?
- కరోనావైరస్: లాక్డౌన్ ప్రభావంతో పాఠశాలలు ఎలా మారిపోయాయంటే..
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
తాజా వివాదం ఏమిటి?
2018లో ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఇటీవల అర్ణబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అర్ణబ్కు బెయిల్ జారీచేసేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అర్ణబ్ అభ్యర్థనపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం ఆయనకు మధ్యంతర బెయిలును మంజూరు చేసింది.
ఈ విషయంలో సుప్రీం కోర్టు న్యాయూర్తులు, న్యాయవాదులను విమర్శిస్తూ బుధవారం సాయంత్రం స్టాండప్ కమేడియన్ కుణాల్ కామ్రా వరుస ట్వీట్లు చేశారు. కొన్ని అభ్యంతర చిత్రాలనూ ఆయన పోస్ట్చేశారు.
కుణాల్ కామ్రా ట్వీట్లపై దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ చర్యలుగా పరిగణించాలంటూ కొందరు న్యాయవాదులు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను గోపాల్ను కోరారు.
- ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు తెరిచిన వారంలోనే పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తల్లిదండ్రుల్లో ఆందోళన
- పాఠశాలల్లో కుల, మత ప్రస్తావన లేకుండా చేయొచ్చా? ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆచరణ సాధ్యమేనా?
''దేనికైనా హద్దు ఉంటుంది''
కుణాల్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని వేణుగోపాల్ చెప్పారు. ఇవి క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయని వివరించారు.
''ఇవి తీవ్రమైన వ్యాఖ్యలు మాత్రమే కాదు. వినోదం పేరుతో ఆయన హద్దుల్ని మీరారు. ఈ వ్యాఖ్యలు క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తాయని నేను భావిస్తున్నాను''అని వేణుగోపాల్ వివరించారు.
''ఇది సుప్రీం కోర్టు సమగ్రత, స్వతంత్రత, నిస్పక్షపాతాన్ని తప్పపట్టడం. న్యాయమూర్తులకూ ఆరోపణలు ఆపాదించడం. కేవలం ఒక పార్టీ కోసం కోర్టు పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించడం''.
''వాక్ స్వాతంత్ర్యం పేరుతో సుప్రీం కోర్టును, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను ఇష్టమొచ్చినట్లు, నిస్సంకోచంగా విమర్శించొచ్చని నేడు చాలామంది భావిస్తున్నారు. అయితే, వాక్ స్వాతంత్ర్యం అనేది రాజ్యాంగంలోని కోర్టు ధిక్కరణ చర్యలకు లోబడి ఉంటుంది. సుప్రీం కోర్టును నిస్సంకోచంగా విమర్శిస్తే శిక్షలు తప్పవని ప్రజలు నేడు తెలుసుకొనే సమయం వచ్చింది''అని వేణుగోపాల్ తెలిపారు.
కుణాల్పై కోర్టు ధిక్కరణ కింద కేసులు మోపేందుకు అనుమతి కోరిన ఎనిమిది మంది న్యాయవాదులకు వేణుగోపాల్ ఆమోదం తెలుపుతూ ఒక లేఖ విడుదల చేశారు.
- పవన్ కల్యాణ్కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
- క్రమశిక్షణా లేక సృజనాత్మకతా? విద్యార్థులకు ఏది ముఖ్యం?
ఇంతకీ కోర్టు ధిక్కరణ అంటే?
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ -1971 ప్రకారం.. కోర్టు ధిక్కరణ రెండు రకాలు. వీటిలో మొదటిది సివిల్ కంటెంప్ట్. రెండోది క్రిమినల్ కంటెంప్ట్.
ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలకు ఉద్దేశపూర్వకంగానే అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం లేదా మాటను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడం కూడా దీని కిందకే వస్తుంది.
రెండోది క్రిమినల్ కంటెంప్ట్. దీనిలో మూడు రకాలున్నాయి. ఈ నిబంధనలను ప్రచురణ రూపంలో లేదా వ్యాఖ్యలు చేయడం, లేదా సంజ్ఞల రూపంలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఆ నింధనలు ఏమిటంటే..
- ఏదైనా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలా చేయడం లేదా దూషణలకు పాల్పడటం
- కోర్టు ప్రక్రయల్లో జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నించడం లేదా పక్షపాతం చూపించడం
- ఏదైనా చర్యల ద్వారా న్యాయ పరిపాలన ప్రక్రియలకు అడ్డు తగలడం
ప్రస్తుతం కుణాల్పై క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రక్రియల కింద కేసు నమోదు చేసేందుకు వేణుగోపాల్ ఆమోదం తెలిపారు.
క్రిమినల్ కంటెంప్ట్తో పోలిస్తే సివిల్ కేసులు ఎక్కువగా వస్తాయని నల్సార్ లా యూనివర్సిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ చెప్పారు.
''కోర్టు ఆదేశాలను అనుసరించకపోతే.. సివిల్ కంటెంప్ట్ కిందకు వచ్చేస్తుంది. క్రిమినల్ కేసు అవ్వాలంటే.. తీర్పును తప్పుపట్టడం లేదా ప్రతిష్ఠను మసకబార్చేలా వ్యాఖ్యలు లేదా ప్రచురణలు చేయాల్సి ఉంటుంది. అందుకే క్రిమినల్ కంటెంప్ట్తో పోలిస్తే.. సివిల్ కేసులు ఎక్కువ''అని ఆయన చెప్పారు.
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- మనిషి సగటు శక్తి కంటే గర్భిణుల సామర్థ్యం ఎక్కువా
అటార్నీ జనరల్ అనుమతి అవసరమా?
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లోని సెక్షన్ 1(15) ప్రకారం.. క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. లేదా అటార్నీ జనరల్ లేదా అటార్నీ జనరల్ సమ్మతితో మరెవరైనా కేసులు నమోదు చేయొచ్చు.
''సాధాణంగా సుప్రీం, లేదా హైకోర్టులు తమకు తాముగానే కేసులను పరిగణలోకి తీసుకుంటాయి. అదే సాధారణ పౌరులు లేదా న్యాయవాదుల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కేసు నమోదు చేయాలంటే... సుప్రీం కోర్టు విషయానికి వస్తే అటార్నీ జనరల్ అనుమతి తీసుకోవాలి. అదే హైకోర్టు విషయంలో అడ్వొకేట్ జనరల్ అనుమతి తీసుకోవాలి''అని శ్రీధర్ వివరించారు.
గత ఆగస్టులో సుప్రీం కోర్టుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ నటి స్వరా భాస్కర్పై క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చర్యలు తీసుకోనేందుకు అనుమతి ఇవ్వాలంటూ అటార్నీ జనరల్ను అంజు సక్సేనా అనే న్యాయవాది కోరారు. అయితే, ఈ అభ్యర్థనను వేణుగోపాల్ తిరస్కరించారు.
శిక్షలు ఏమిటి?
కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా విధించొచ్చు. లేదా కొన్నిసార్లు రెండూ విధిస్తారు.
అయితే, ఒక్కోసారి క్షమాణలు చెప్పడం ద్వారా ఈ శిక్షలను కోర్టులు మాఫీ చేస్తాయి. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ విషయంలో ఇలానే జరిగింది. ఆయన క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో రూ.1 జరిమానాను కోర్టు విధించింది.
''ప్రముఖులపై కూడా ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన దాఖలాలు ఉన్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన పుంజల శివ శంకరే దీనికి ఉదాహరణ. అయితే, ఆయనకు కోర్టు ఎలాంటి శిక్షా విధించలేదు. తాజాగా అయితే, ప్రశాంత్ భూషణ్ కేసునూ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు''అని శ్రీధర్ వివరించారు.
''ప్రశాంత్ భూషన్ తాజాగా చేసిన వ్యాఖ్యల విషయంలో వెంటనే సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. అయితే, 10ఏళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో మరో కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఈ కేసుల విచారణను ఇన్ని నెలల్లో పూర్తి చేయాలని నిబంధన ఏమీలేదు''అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక 'దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- 'దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- 'నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్కు సిద్ధంగా ఉంటాయా?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- కఠినమైన సవాళ్ల నడుమ 'కమలం’ ఎలా వికసించింది
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)