క్లైమాక్స్కు చేరిన కర్నాటకం.. రెబెల్ ఎమ్మెల్యేల పిటీషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ..
ఢిల్లీ : కర్నాటకం క్లైమాక్స్కు చేరింది. ఎమ్మెల్యేల తిరుగుబాటు బలపరీక్షకు దారి తీసింది. సంకీర్ణ ప్రభుత్వం గురువారం విశ్వాస పరీక్షకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు ఎమ్మెల్యేల పిటీషన్పై సుప్రీంకోర్టు తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలేదంటూ కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వరకు యధాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు సుప్రీంకోర్టు తీసుకోనున్న నిర్ణయం కీలకంగా మారనుంది.
కర్నాటకం : బలపరీక్షకు ముహూర్తం ఖరారు..
అసెంబ్లీలో గందరగోళం
ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. సుప్రీం తీర్పు తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బల పరీక్ష విషయంలో సోమవారం కర్నాటక అసెంబ్లీ దద్దరిల్లింది. సీఎం కుమారస్వామి విశ్వాసం నిరూపించుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అందుకు తాము సిద్ధమేనంటూ కుమారస్వామి వర్గం ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
రెబెల్ ఎమ్మెల్యేల డుమ్మా?
ఇదిలా ఉంటే బలపరీక్ష సమయంలో అసెంబ్లీకి హాజరుకాకూడదని రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ - జేడీఎస్ తమ బలం నిరూపించుకునే సమయంలో సభకు హాజరై వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత వేటు పడే అవకాశముంది. అందుకే సభకు వెళ్లకుండా ఉండాలని రెబెల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి తమకు ముప్పు ఉందని రెబెల్ నేతలు ఆరోపిస్తున్నారు.
కుమారస్వామికి కష్టమే
కర్నాటక శాసనసభలో 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16మంది రాజీనామా చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు వారి రాజీనామాలు ఆమోదించాలని తీర్పు ఇస్తే సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది. దీంతో మేజిక్ ఫిగర్ 105కు చేరుతుంది. అసెంబ్లీలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యాబలం 101 మాత్రమే. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి విజయం సాధించడం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.