స్వలింగ సంబంధం నేరమా?: సుప్రీం పున:సమీక్ష
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల మధ్య లైంగిక సంబంధం నేరపూరితం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377ను సవాల్ చేయడంలో పలు ముఖ్యమైన రాజ్యాంగపరమైన కోణాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నందున ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం సబబని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఎఆర్ దవె, జస్టిస్ జెఎస్ ఖేహర్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
స్వలింగ సంపర్కం ప్రకృతికి విరుద్ధమనే కారణంతో ఈ చర్యలను నేరంగా పరిగణిస్తూ 1860లో బ్రిటిష్ హయాంలో భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ను ప్రవేశపెట్టారు. మానవ సంబంధం పరిధికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్న ఈ కేసును విస్తృత ధర్మాసనం విచారించాలన్న వాదనతో త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. విస్తృత ధర్మాసనం భవిష్యత్తులో ఏర్పాటవుతుందని వెల్లడించింది.
స్వలింగ సంపర్కాన్ని నేర పరిధిలోంచి తప్పిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ 2013, డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై, రివ్యూ పిటిషన్పై పునఃపరిశీలన చేయాలని కోరుతూ ఎనిమిది క్యూరేటివ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో పలువురు సీనియర్ న్యాయవాదులు మంగళవారం హాజరయ్యారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ వ్యక్తిగత పరిధిలో యుక్త వయస్కుల పరస్పర అంగీకార లైంగిక చర్యకు శిక్ష విధించే ఏ నిబంధన అయినా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మీ వాదనను ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? అని సిబల్ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు స్వలింగ సంపర్కాన్ని నేరపరిధి నుంచి తప్పించడానికి అఖిల భారత చర్చిల సంఘం, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకంగా ఉన్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది.
కాగా, స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగ ధర్మాసనం పునఃపరిశీలనకు నివేదిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని పలువురు సామాజిక కార్యకర్తలు, కేంద్ర మాజీమంత్రి చిదంబరం స్వాగతించారు. ఓ తప్పును సరిదిద్దడానికి అవకాశం లభించిందని ఆయన అన్నారు.