ఆయన జర్నలిస్ట్.. మర్డర్ ఏం చేయలేదు.. విడిచిపెట్టండి..
ఢిల్లీ : జర్నలిస్టును అరెస్ట్ చేసిన ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ముఖ్యమంత్రిని అవమానించారన్న కారణంతో ప్రశాంత్ కనోజియాను అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రశాంత్ అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఆయనను ఎందురు అరెస్ట్ చేశారు? ఆయనేమైనా మర్డర్ చేశాడా అని ప్రశ్నించింది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రశాంత్ను విడుదల చేసి యూపీ ప్రభుత్వం తన పెద్ద మనసు చాటుకోవాలని తీర్పులో స్పష్టం చేసింది.
12 మంది ఐటీ అధికారులపై వేటు.. అవినీతి, లైంగిక వేధింపులే కారణం..
పౌరుల స్వేచ్ఛలో రాజీలేదన్న సుప్రీం
సీఎం యోగి ఆదిత్యనాథ్ను కించపరిచేలా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చేసిన కేసులో ప్రశాంత్ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన భార్య పిటీషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పౌరుల స్వేచ్ఛ పవిత్రమైందని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని, దాన్ని ఎవరూ ఉల్లంఘించలేరని కోర్టు స్పష్టం చేసింది.
యోగికి పెళ్లి ప్రతిపాదన
యూపీలో ఇటీవల ఓ మహిళ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ప్రసారం చేయడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ఛానెల్ అధిపతి ఇషితా సింగ్, ఎడిటర్ అనుజ్ శుక్లాలను అరెస్ట్ చేశారు. వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేసి సీఎం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశాడంటూ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ను ఖండించిన రాహుల్ గాంధీ
ఇదిలా ఉంటే జర్నలిస్టు అరెస్టుపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ స్పందించారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పుడు వార్త రాసారని ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు రాద్దాంతం చేసి జర్నలిస్టులను జైళ్లలో వేయిస్తే పత్రికలు, న్యూస్ ఛానళ్లు తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటాయని సటైర్ విసిరారు. యూపీ సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని రాహుల్ ట్వీట్ చేశారు.