బీజేపీకి విషమ పరీక్ష: ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే ఫ్లోర్ టెస్ట్: ఆ ఎంపికే కీలకం..!
మహారాష్ట్రలో ఫడ్నవీస్ బల పరీక్ష..ఇప్పుడు బీజేపీకి విషమ పరీక్షగా మారుతోంది. కేవలం 24 గంటల సమయం మాత్రమే బల పరీక్షకు సుప్రీం కోర్టు సమయం ఇవ్వటంతో..అదనపు సమయం కోరుతూ బీజేపీ సుప్రీంను అభ్యర్ధించింది. ఇప్పటి వరకు తమకు పూర్తి మెజార్టీ ఉందని చెబుతున్న బీజేపీ..దీనిని సభలో నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికే తమకు 162 మంది ఎమ్మెల్యే మెజార్టీ ఉందంటూ మూడు పార్టీల కూటమి పెరేడ్ నిర్వహించింది.
ఇదే సమయంలో ఒక్క రోజులోనే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంతో పాటుగా..ప్రొటెం స్పీకర్ ద్వారానే బల పరీక్ష అంశం పూర్తి చేయాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో..అనూహ్యంగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ..ఇప్పుడు ఈ పరీక్షలో నిలబడుతుందా..తడబడుతుందా అనేది చూడాలి.
బీజేపీ బల పరీక్ష..విషమ పరీక్ష
సుప్రీం కోర్టు మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్ష మీద స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బుధవారం సభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రారంభించి..సాయంత్రం అయిదు గంటలకు బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఒక్క రోజులోనే మొత్తం వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్దేశించింది. సభ నిర్వహణ కోసం వెంటనే ప్రొటెం స్పీకర్ ను ఎంపిక చేయాలని సూచించంది.
ఇప్పుడు ఇదే బీజేపీకి పరీక్షగా మారుతోంది. తొలుత గవర్నర్ ఈ నెల 30 వ తేదీ వరకు బలపరీక్షకు సమయం ఇవ్వటంతో..ముందుగా ప్రొటెం స్పీకర్ .. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం..ఆ తరువాత రెగ్యులర్ స్పీకర్ ఎంపిక.. అప్పుడు బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుదని బీజేపీ అంచనా వేస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఆకస్మికంగా సుప్రీం కోర్టు కేవలం ఒక్క రోజు సమయం..అందునా మొత్తం ఉదయం నుండి సాయంత్రానికి బల పరీక్ష ముగించాలని ఆదేశించటం తో బీజేపీకి ఇది విషమ పరీక్షగా మారుతోంది.
ప్రొటెం స్పీకర్ సమక్షంలో..
సాధారణంగా బల పరీక్షకు ముందు సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆయన సభలోని మొత్తం ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక.. ఆ వెంటనే బల పరీక్ష జరుగుతాయి. కానీ, ఇక్కడ సుప్రీం కోర్టు వెంటనే సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవాలని..ఆయన పర్యవేక్షణలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.
దీంతో..బీజేపీ ఎక్కడా సమయం..వెసులుబాటు లేకుండా పోయింది. నిజంగా బేజేపీ చెబుతున్నట్లుగా వారికి మెజార్టీ ఉందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మూడు పార్టీల కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతుంటే..బీజేపీ తమకు 170 మంది మద్దతు ఉందని వాదించింది. ఇక, ఇప్పుడు సభలోనే ఎవరి బలం ఏంటనేది తేలనుంది. ఇదే సమయంలో ప్రొటెం స్పీకర్ గా సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను అధికార పార్టీ సిఫార్సు చేస్తుంది. కానీ, ఇక్కడ ప్రభుత్వం లేకపోవటంతో..గవర్నర్ సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆయన పర్యవేక్షణలోనే మొత్తం వ్యవహారం కొనసాగనుంది.
బీజేపీ ప్రొటెం స్పీకర్ నుండి బలపరీక్ష దాకా...
ఇక, ఇప్పుడు గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా సభలోనే సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యేను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నుండే ప్రొటెం స్పీకర్ ఎన్నిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే గవర్నర్ వద్ద ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తరువాత ప్రొటెం స్పీకర్ బుధవారం మహారాష్ట్ర అసెంబ్టీ సమావేశానికి సంబంధించి నోటీఫికేషన్ ఆయన కార్యాలయం నుండి వెలువడుతుంది. సాయంత్రానికి మొత్తం 288 మంది సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించి..సుప్రీం ఆదేశాల మేరకు సాయంత్రి బల పరీక్ష నిర్వహిచాల్సి ఉంటుంది. ఇక, ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయనేది చూడాలి.