జీవితంలో అత్యంత కఠినమైన రోజులు: సుప్రియా సూలే, అధిపత్య పోరాటంతో చకచకా పావులు
మహారాష్ట్రలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీతో అజిత్ పవార్ చేతులు కలపడంపై శరద్ పవార్, సుప్రియా సూలేతోపాటు కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఫడ్నవీస్తో కలిసి అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తన కుటుంబం, పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై వాట్సాప్ సందేశంతో స్పందిస్తూ..
ఎప్పటికీ వృథా కావు..
ఎన్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు గుడ్మార్నింగ్. ఎప్పటికైనా విలువలే విజయం సాధిస్తాయి. నిజాయితీ, హార్డ్ వర్క్ ఎప్పటికీ వృథా కావు. విలువలను ఆచరిస్తూ సాగే ప్రయాణం కఠినంగా ఉన్నప్పటికీ.. అదే సుదీర్ఘకాలం సాగుతుంది అని సుప్రియా సూలే ఓ సందేశాన్ని పోస్టు చేశారు. నా జీవితంలో ఇవి అత్యంత కఠినమైన రోజులు. ఈ అనుభవం నన్ను మరింత దృఢంగా మార్చింది. ఈ కష్టకాలంలో నా వెంట నడిచిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ అని సుప్రియా సూలే పేర్కొన్నారు.
పార్టీపై సుప్రియా ఆధిపత్యం
గత కొద్దిరోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు అవగాహనకు వచ్చిన నేపథ్యంలో సీఎంగా ఫడ్నవీస్, అజిత్ పవార్ను డిప్యూటీ సీఎంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం మూడు పార్టీలను షాక్కు గురిచేసింది. శనివారం ఉదయం చోటుచేసుకొన్న అనూహ్య పరిస్థితులపై సుప్రియా సూలే స్పందిస్తూ పార్టీ, కుటుంబం చీలిపోయిందని సుప్రియా ఆవేదన వ్యక్తం చేశారు.
పావులు కదుపుతున్న సుప్రియా
ఎన్సీపీకి అజిత్ పవార్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకొని సుప్రియా సూలే తన పార్టీలో అధిపత్యాన్ని కొనసాగించారు. తండ్రి శరద్ పవార్తో కలిసి ఆమె చకచకా పావులు కదిపారు. అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి వెనుకకు రప్పించే కార్యక్రమాన్ని చేపట్టడంలో సక్సెస్ అయ్యారు. అజిత్ పవార్ను లెజిస్లేచర్ పార్టీ నేతగా తొలగిస్తూ వెంటనే నిర్ణయం తీసుకొవడం చకచకా జరిగిపోయాయి.
51 మంది ఎమ్మెల్యేలు మాతోనే
శనివారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశం అనంతరం ఎన్సీపీతోనే 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజారిటీ లేదని, వెంటనే బల పరీక్ష నిర్వహించాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారాలన్నీ తండ్రితో కలిసి సుప్రియా సూలే పకడ్బందీగా నిర్వహించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.