అజిత్ పవార్కు సుప్రియా ఆత్మీయ ఆలింగనం: ఆదిత్య థాక్రేకు స్వాగతం, ఫడ్నవీస్తో ముచ్చట్లు
ముంబై: ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. ఒక్కసారిగా డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో, సీఎం పదవికి ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎన్సీపీని వీడిన అజిత్ పవార్ రాజీనామా చేశారు. అయితే అజిత్ పవార్ను తిరిగి ఎన్సీపీలోకి ఆహ్వానించింది. అంతకుముందు ఎన్సీపీ సీనియర్ నేతలు అజిత్ను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.
సోదరుడికి ఆత్మీయ ఆలింగనం
ఇక బుధవారం రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన అజిత్ పవార్కు ఘనస్వాగతం పలికింది పార్టీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే. సుప్రియా సూలే, అజిత్ పవార్లు ఇద్దరూ కలిసి అసెంబ్లీకి వచ్చారు. తన సోదరుడు అజిత్ను ఎంతో ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు సుప్రియా సూలే. ఆ సమయంలో ఇద్దరూ చాలా భావోద్వేగానికి గురయ్యారు.
కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన ఫడ్నవీస్
ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకు సుప్రియా సూలే స్వాగతం పలికారు. అంతకుముందు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి కాసేపు మాట్లాడారు. ఇద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మహావికాస్ అగాడీ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుభాకాంక్షలు తెలిపారు.
యువ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకు స్వాగతం పలికిన సుప్రియా
తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిత్య థాక్రే ప్రమాణస్వీకారం చేసేందుకు మహారాష్ట్ర అసెంబ్లీకి చేరుకోగా.. ఆయనకు ఘనస్వాగతం పలికారు సుప్రియా సూలే. ఎంతో సంతోషంతో ఈ యువ ఎమ్మెల్యేను ఆలింగనం చేసుకున్నారు. కాసేపు ముచ్చటించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న ఆదిత్య థాక్రేకు సుప్రియా సూలే శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు ఆదిత్య థాక్రే ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.