ఆగని దారుణాలు: మైనర్పై లైంగిక దాడి, హత్య, 86 చోట్ల గాయాలు
సూరత్: దేశంలోని యూపీలోని ఉన్నావ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథూవాలో చోటు చేసుకొన్న అత్యాచార ఘటనలపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. 11 ఏళ్ళ మైనర్ బాలికపై వారం రోజులుగా లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. బాలిక శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో 8 ఏళ్ళ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యాయి.ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరిస్తానని ప్రకటించింది.
యూపీ రాష్ట్రంలో ఓ బిజెపి ఎమ్మెల్యే, అనుచరులు గ్యాంగ్రేప్ కు పాల్పడ్డారని ఓ యువతి ఆందోళనకు దిగింది. వారం రోజుల క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో మైనర్ బాలికను వారం రోజులుగా హింసించి గొంతు పిసికి చంపేశారు. బాలిక మృతదేహంపై86 చోట్ల గాయాలున్నాయని పోస్టుమార్టం నివేదిక తెలిపింది. బాలిక మృతదేహనికి పోస్టు మార్టం నిర్వహించిన సూరత్ సివిల్ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగం చీఫ్ గణేష్ గొవేకర్ ప్రకటించారు.
బాలిక జననాంగాల వద్ద చెక్కతో చేసిన ఆయుధంతో గాయపర్చినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైందని ఆయన చెప్పారు. వారం రోజుల పాటు బాలికను చిత్రవధ చేశారని వైద్యులు శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా వెల్లడించారు.
బాలికపై అత్యాచారం చేశారా, లేదా అనే విషయమై ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే మృతదేహం నుండి తీసిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు గణేష్ గొవేకర్ చెప్పారు.
అయితే మృతురాలి గురించిన సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిపిన వారికి రూ.20 వేలను ఇస్తామని పోలీసులు ప్రకటించారు.