ఉద్యోగులకు వజ్రాల వ్యాపారి దీపావళి గిఫ్ట్: 1700 మందికి కార్లు, ప్లాట్లు, 600 మందికి ఖరీదైన కార్లు
సూరత్: గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి తన సంస్థలో పని చేసే 600 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ వ్యాపారి పేరు సావ్జీ ఢోలాకియా. ప్రతి సంవత్సరం తమ సంస్థలో పని చేసే వారికి ఆయన విలువైన బహుమతులు ఇస్తారు. దానిని ఈసారి కూడా కొనసాగించారు.
ఈ దీపావళి సందర్భంగా దాదాపు 1700 మంది ఉద్యోగులకు విలువైన కార్లు, ప్లాట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను అందించారు. గురువారం ఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇద్దరు మహిళా ఉద్యోగులకు కారు తాళాలను అందించారు. సూరత్లో నిర్వహించిన కానుకల బహూకరణ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు.
సావ్జీ సంస్థ ఉద్యోగుల్లో 600 మంది ఈసారి మారుతి సుజుకి ఆల్టో, సెలెరియో కార్లను అందుకున్నారు. సావ్జీ నెలకొల్పిన హరికృష్ణ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సూరత్ కేంద్రంగా నడిచే ఈ సంస్థలో 5,500మంది పని చేస్తున్నారు. సుమారు నాలుగు వేలమంది ఇప్పటికే కానుకలు అందుకున్నారు.
ఏటా నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగులను ఎంపిక చేసి ఇళ్లు, కార్లు, వజ్రాభరణాల వంటి బహుమతులు అందిస్తారు. సావ్జీ 2014 నుంచి ఇలా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ ఉద్యోగులకు ఆయన ఏకంగా రూ.కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్యూవీ కార్లను ఇచ్చారు.