పిల్లలు కాదు పిడుగులు: పదవ తరగతిలోనే అంతరిక్షంలో ఏం కనుగొన్నారో తెలుసా..నాసా సెల్యూట్
పిల్లలే కానీ పిడుగులు అని నిరూపించారు ఇద్దరు 10వ తరగతి చదివే అమ్మాయిలు. వారి వయస్సుకు సాధారణంగా 10వ తరగతిలో ఉత్తమమైన మార్కులు సాధిస్తారు. బాగా చదువకుని రాష్ట్ర స్థాయిలోనో లేక దేశస్థాయిలోనో మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఈ ఇద్దరమ్మాయిలు మాత్రం ఏకంగా అంతరిక్షంలో జరిగే అద్భుతాన్ని కనుగొన్నారు. అంతేకాదు వీరు కనుగొన్నది నిజమే అని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా కూడా ధృవీకరించింది.
ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థినులు ఇప్పుడు అంతరిక్షం పై ఫోకస్ చేశారు. అంతరిక్షంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని కనుగొన్నారు. సూరత్కు చెందిన వైదేహి మరియు రాధికా లఖానీలు చదువులోనే దిట్ట కాదు ఇతర విషయాల్లో కూడా వీరు చాలా యాక్టివ్గా ఉంటారు. వీరు చదువుతున్న స్కూలు పీపీ సావని చైతన్య విద్యాసంకుల్లో రెండు నెలల పాటు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సమయంలో వారు అంగారకుడికి దగ్గరలో భారీ గ్రహ శకలం పయనిస్తుందని వారు కనుగొన్నారు. అయితే ఇంత చిన్న వయస్సులోనే అంతరిక్షంలో జరిగే అద్భుతం గురించి ముందుగానే చెప్పిన ఆ చిన్నారుల ప్రతిభను ప్రశంసిస్తూ అది నిజమేనని నాసా నిర్థారించింది. దీనికి పేరు HLV2514 అని పెట్టింది.
ఇక రెండు నెలలపాటు ఆ చిన్నారుల స్కూల్లో జరిగిన సైన్స్ కార్యక్రమంను స్పేస్ ఇండియా సంస్థ మరియు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబొరేషన్ మరియు టెక్సాస్లోని హార్దిన్ సిమన్స్ యూనివర్శిటీలు కలిసి నిర్వహించాయి. ఇక్కడ విద్యార్థులు పాన్ స్టార్స్ అనే అడ్వాన్స్ టెలిస్కోప్ను వినియోగించారు. ఇందులో హైగ్రేడ్ సీసీడీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాదు గ్రహశకలాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక స్పేస్ ఇండియా తన ఫేస్బుక్ పేజ్పై విద్యార్థులు కనుగొన్న విషయాన్ని తెలిపింది. ఈ ఇద్దరు విద్యార్థులు భూమికి దగ్గరగా ఉన్న గ్రహశకలంను కనుగొనడంపై తమకు చాలా గర్వంగా ఉందని తమ ఫేస్ బుక్ పేజ్పై రాసుకొచ్చింది.
ఇక స్పేస్ ఇండియా చేసిన పోస్టుకు చాలామంది నెటిజెన్లు ఈ విద్యార్థులను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. భవిష్యత్తులో ఈ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుని మరిన్ని అంతరిక్ష పరిశోధనలు చేయాలని కొత్త విషయాలను కనుగొనాలని కోరుతూ పోస్టులు పెట్టారు.