సూరత్ రేప్ మిస్టరీ వీడింది: బాలికపై హత్యాచారం వెనుక ఇవీ నిజాలు..
అహ్మదాబాద్: ఎట్టకేలకు సూరత్ హత్యాచార కేసు మిస్టరీ వీడింది. బాలికతో సహా ఆమె తల్లిపై కూడా అత్యాచారం చేసిన నిందితులు.. ఆమె తప్పించుకోవడంతో బాలికపై మరింతగా రెచ్చిపోయినట్టు తేల్చారు. బాలికను, ఆమె తల్లిని రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసినట్టు తేలడం గమనార్హం.
ఎవరీ తల్లికూతుళ్లు?:
రాజస్థాన్లోని సవాయి మోదోపూర్ జిల్లా గంగాపూర్కు చెందిన హర్సయి గుజ్జర్(35) ఇంట్లోకి పనిమనుషులు కావాల్సిందిగా తెలిసినవాళ్లను సంప్రదించాడు. ఈ క్రమంలోనే ఓ వితంతు మహిళను, ఆమె 11ఏళ్ల కుమార్తెను ఓ దళారీ నుంచి కొనుగోలు చేశాడు. మార్చి 15వ తేదీని వారిద్దరిని సూరత్కు తరలించి ఓ భవనంలో ఉంచాడు.
తప్పించుకున్న తల్లి.
భవనంలో వారిని నిర్బంధించిన తర్వాత హర్సయి తన సోదరుడు హరిసిన్హ్, మరో ఇద్దరు స్నేహితులు నరేశ్, అమర్సిన్హ్ గుజర్ లతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఆపై అంతా కలిసి వారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అలా వరుసగా 5రోజుల పాటు వారిపై లైంగిక దాడి జరిగింది. ఆరో రోజు బాలిక తల్లి వారి చెర నుంచి తప్పించుకుని పారిపోయింది.
గొంతు నులిమి హత్య
బాలిక తల్లి తప్పించుకుని పారిపోవడంతో.. హర్సయి&గ్యాంగ్ మరింత రెచ్చిపోయారు. చిన్నారిపై మరింత వికృతంగా లైంగిక దాడి జరిపారు. చివరకు ఏప్రిల్ 5న చిన్నారి గొంతు నులిమి హత్య చేసి.. ఆ శవాన్ని తన కారులో భేస్తన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం పడేశారు. ఏప్రిల్ 6వ తేదీన చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి చిన్నారి ఎవరన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇలా దొరికారు.
సీసీటివి ఫుటేజీ దృశ్యాల ఆధారంగా కేసును చేధించారు పోలీసులు. భేస్తన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆ దృశ్యాల్లో నిందితుడి కారు కదలికలను గమనించారు. ఆపై ప్రధాన నిందితుడు హర్సయితో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలిక తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.