'గుజరాత్ ఎన్నికల్లో మోడీకి చుక్కలే.. కేసీఆర్ దారి చూపిస్తున్నారు.. అక్కడికి వచ్చేస్తాం..'
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తప్పేలా లేవు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు పేద, మధ్యతరగతి వర్గాలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.
ఈ కలవరం ఓట్ల రూపంలో బీజేపీకి ప్రతికూలంగా నమోదైతే ఆ పార్టీ పతనం మొదలైనట్లేనన్నది పరిశీలకుల వాదన. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, గోరక్షక దాడులు, ఉద్యోగాలు కోల్పోవడం, ధరల పెరుగుదల, పాటిదార్ల ఉద్యమం, ఇవన్నీ ఇప్పటి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలుగా కనిపిస్తున్నాయి.
జౌళి కార్మికుల్లో వ్యతిరేకత:
అహ్మదాబాద్ వర్తక, వ్యాపారుల నుంచి బీజేపీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో పరిశ్రమ కార్మికులు ఎక్కువగా ఉండే సూరత్ లోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
సూరత్ లోని వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల బతుకులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ 16కి 16సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ దఫా ఎన్నికల్లో సగానికి పైగా సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
రేపు తొలిదశ పోలింగ్.. యువతరం ఎటువైపు.. రాహుల్ ప్రచారం గట్టెక్కిస్తుందా?
సూరత్లో బీజేపీకి కష్టకాలం:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లుపై ఆయన సొంత రాష్ట్రంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూరత్ లోని హోటల్స్ అన్ని జీఎస్టీపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. 2012లోనే చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పడిపోయింది. ఇప్పుడది మరింతగా పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సూరత్ లోని నియోజకవర్గాల్లో వరచ్చా రోడ్, ఉధ్నా, కరంజ్, లింబాయత్, సూరత్ నార్త్, సూరత్ ఈస్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీచే అవకాశం ఉంది. సూరత్ పక్కనే ఉన్న వ్యారా, నిజార్ లలో కూడా బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
గుజరాత్లో ఇదీ పరిస్థితి: బీజేపీకి 'టఫ్ టైమ్'.., వ్యాపార వర్గాలు ఏమంటున్నాయంటే?..
వ్యాపారాలకు దెబ్బ:
బీజేపీ విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని సూరత్ వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే తమ వ్యాపారాలు 60శాతం పడిపోవడంతో.. జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందన్నారు. ఔళి పరిశ్రమల్లో జీతాలు తగ్గించడంతో ఆకలి తీర్చుకోవడమే కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. ధరలు పెరిగి, జీతాలు తగ్గి దుర్భరంగా బతకుతున్నామని అంటున్నానరు.
పాటిదార్ల ఆధిపత్యం:
పాటిదార్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే వరచ్చారోడ్లో బీజేపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. ఇక్కడినుంచి కాంగ్రెస్, బీజేపీల తరుపున పాటిదార్ నేతలే పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ధీరూభాయి గజేరాకు పాటిదార్ ఆనామత్ ఆందోళన సమితి మద్దతు ఉంది.
మొదట బీజేపీ ఎంపీ అయిన గజేరా.. నానూ వనానీని సూరత్ నార్త్లో పార్టీ అభ్యర్థిగా మోడీ ఎంపిక చేయడంతో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. వరచ్చా రోడ్లో పాటిదార్ల ఉద్యమ సమయంలో మహిళలు పోలీసుల దమనకాండకు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలు తమ కాలనీల్లోకి వస్తే తరిమికొడుతామని అప్పట్లో హెచ్చరించారు.
మోడీకి చుక్కలు చూపిస్తాం:
ఉద్నాలోని కాలనీల్లో ఔళి కార్మికులు ఎక్కువగా నివసిస్తున్నారు. వీరిలో లక్షన్నర మంది ఓటర్లు ఉండగా.. 'మా కడుపు కొట్టిన బీజేపీకి ఈసారి చుక్కలు చూపిస్తాం' అని ఒక తెలుగు ఓటరు పేర్కొనడం గమనార్హం. ఇక్కడున్న తెలుగువాళ్లలో తెలంగాణలోని పద్మశాలి సామాజికవర్గానికి చెందినవరే ఎక్కువగా ఉన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీపై వారు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
తిరిగి తెలంగాణకే:
కొద్ది నెలల క్రితమే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మడికొండలో కాకతీయ జౌళి కార్మికుల సహకార సంఘం పేరుతో ఏర్పడుతున్న టెక్స్టైల్ పార్క్ త్వరలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్లో వేగం పెరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన 61 ఎకరాలను కేంద్ర సహాయంతో అభివృద్ధి పరిచామని, ఇప్పుడు కేసీఆర్ సర్కార్ మరింత చొరవ తీసుకుని కేంద్రం కన్నా ఎక్కువ సబ్సిడీ ఇచ్చిందని సంఘం సభ్యులు చెబుతున్నారు. తద్వారా నిర్మాణం మరింత వేగవంతం అయిందని అంటున్నారు.
కేసీఆర్ దారిచూపిస్తున్నారు:
మోడీ విధానాలతో దెబ్బతిన్న తమకు కేసీఆర్ దారి చూపిస్తున్నారని సూరత్ లోని జౌళి పరిశ్రమ కార్మికులు అంటున్నారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం పూర్తయితే సూరత్ వలస వెళ్లిన దాదాపు 5వేల మంది తెలంగాణ ప్రజలు వెనక్కి వస్తారని పార్క్ నిర్మాణంలో భాగస్వామ్యులైన సభ్యులు చెబుతున్నారు.
సూరత్ వెళ్లడం వల్ల రెండు చోట్లా స్థానికతను కోల్పోయమాని, తిరిగి వరంగల్ వచ్చి ఇక్కడే స్థిరపడుతామని చెబుతున్నారు. చెప్పారు. సూరత్లో తెలుగువారంతా తిరిగి వస్తారని, వారు వరంగల్ను మినీ సూరత్గా మారుస్తారని ఓ జౌళి పరిశ్రమ కార్మికుడు అభిప్రాయపడ్డారు.