Coronavirus:కేసులు పెరుగుతున్నాయ్..రాష్ట్రాలకు కేంద్ర బృందాలు: ఏం జరుగుతోంది..?
కరోనావైరస్ దేశాన్ని మరోసారి బెంబేలెత్తిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. అందులో వైరస్ కొత్త వేరియంట్ మరింత కలవరపెడుతోంది. దీంతో ప్రభుత్వాలు లాక్డౌన్ విధిస్తాయా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. తాజాగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 80శాతంకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఒక్క బుధవారం రోజునే 86శాతం కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా బుధవారం నాడు 14,989 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఇందులో మహారాష్ట్రలో 7,863 కరోనావైరస్ కేసులు నమోదు కాగా కేరళ రాష్ట్రంలో 2,938 కేసులు, పంజాబ్లో 729 కేసులు రికార్డు అయ్యాయి. ప్రతి వారానికి కేసులు కొత్త కేసులు పెరుగుతుండటం ఇటు ప్రజలను అటు ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఒకే వారంలో 16,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు బృందాలను రంగంలోకి దించింది. అక్కడి స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించి వైరస్ను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రంగంలోకి దిగిన కేంద్ర బృందాలు పనిని ప్రారంభించాయి. అసలు వైరస్ వ్యాప్తి చెందేందుకు మూలకారణం ఏంటనే దానిని కనుగొనే పనిలో పడ్డాయి. అయితే చాలా చోట్ల బహిరంగ సమావేశాలు, ఫంక్షన్లు ఏర్పాటు చేయడమే ప్రధాన కారణమని గుర్తించిన బృందాలు... ఆయా రాష్ట్రాల్లో కరోనా టెస్టులు కూడా సరిగ్గా నిర్వహించడం లేదనే అంచనాకు వచ్చాయి. ఇక కరోనాను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రజలు అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయడం, ట్రాకింగ్ చేయడం, కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచడం వంటివి స్థానిక ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్రం సూచించింది.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ 1.63 కోట్ల డోసులు మేరా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. జనవరి 16న దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ప్రస్తుతం రెండో విడత వ్యాక్సినేషన్ జరుగుతోంది.