సర్జికల్ స్ట్రైక్స్-2: బాలాకోట్ వైమానిక దాడులకు ఏడాది: వైఖరి మార్చుకోని పాకిస్తాన్..!
న్యూఢిల్లీ: బాలాకోట్.. సరిహద్దులకు అవతల పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఓ చిన్న పట్టణం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ బాలాకోట్ పేరు మనదేశంలో కొన్ని నెలల పాటు మారుమోగిపోయింది. రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలకు కేరాఫ్గా నిలిచింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషె మహ్మద్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం చేపట్టిన రెండో సర్జికల్ స్ట్రైక్స్కు బుధవారం నాటితో ఏడాది పూర్తయింది.
Recommended Video
పుల్వామా దాడికి ప్రతీకారంగా..
ఈ నేపథ్యంలో.. మరోసారి బాలాకోట్పై అందరి దృష్టీ నిలిచింది.పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించిన విషయాన్ని ఇప్పట్లో ఎవరై మరిచిపోలేకపోవచ్చు. సెలవులను ముగించుకుని విధులకు హాజరు కావడానికి బయలుదేరిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషె మహ్మద్ ఆత్మాహూతి దళ సభ్యుడు చేసిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిలో చాలామంది జవాన్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేకపోతున్నారంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
12 రోజుల్లో రెండో సర్జికల్ స్ట్రైక్స్..
పుల్వామా ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత సైన్యం..12 రోజుల తరువాత పాకిస్తాన్పై విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దులను దాటింది. పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్లో గల బాలాకోట్ పరిసరాల్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ జైషె మహ్మద్ సంస్థకు చెందినవే. బాలాకోట్ పరిసరాల్లోని పర్వత శ్రేణులను బేస్ క్యాంపులుగా మలచుకుని ఉగ్రవాదులను తయారు చేసే శిక్షణా కేంద్రాలవి. ఈ దాడిలో 35 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి.
మిరజ్ 2000 ఎయిర్క్రాఫ్ట్లతో..
బాలాకోట్ దాడుల కోసం భారత వైమానిక దళం మిరజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్లను వినియోగించింది. ఇజ్రాయెల్లో తయారైన స్పైస్ బాంబులను ప్రయోగంచింది. జైషె మహ్మద్ నడ్డి విరిచింది. వైమానిక దాడుల సందర్భంగా ఆ సంస్థకు చెందిన పలు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించి వైమానిక దళాధికారులు విడుదల చేసిన ఉపగ్రహ ఫొటోలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. 128 చదరపు మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టించినట్లు నిర్ధారించాయి.
అంతర్జాతీయ వేదికలపై
పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ వైమానిక ఘటనల అనంతరం రెండు దేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలాకోట్ వైమానిక దాడులను అడ్డుగా పెట్టుకుని పాకిస్తాన్.. భారత్ను అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలకు భంగపాటు ఎదురైంది. అదే సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్నాయంటూ భారత్ సైతం ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించింది. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తోందనే విషయాన్ని మరోసారి ఉటంకించింది. .
ఇప్పటికీ స్వేచ్ఛగానే..
అనంతరం- పాకిస్తాన్ భూభాగం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమైంది భారత్. దీనితో జైషె మహ్మద్, లష్కరే తొయిబా వంటి సంస్థల అధినేతలను అరెస్టు చేయాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్, లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సయీద్లను అరెస్టు చేశామని చెప్పుకొంటున్నప్పటికీ.. వారంతా ఇప్పటికీ స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. పాకిస్తాన్ను నడిపిస్తోంది ఉగ్రవాదులేననడానికి ఇవే సాక్ష్యాలనే ఆరోపణలు ఉన్నాయి.