అమావాస్య రోజున.. కటిక చీకటిలో.. పని కానిచ్చేశారు, సర్జికల్ దాడులు జరిగిందిలా...
సర్జికల్ దాడులు ఎలా జరిగాయో మీకు తెలుసా? దీని వెనుక ఉన్నదెవరు? కథ నడిపించిందెవరు? ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమా? లేక ఒక ప్రణాళిక ప్రకారం దాడులకు పాల్పడ్డారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. పూర్తిగా చదవాల
న్యూఢిల్లీ: 'బ్రేకింగ్ న్యూస్ .. నియంత్రణ రేఖ వద్ద పాక్ పై భారత్ సర్జికల్ దాడులు..'అంటూ టీవీల్లో వార్తలు రాగానే ప్రతి భారతీయుడు పులకించిపోయాడు. 'ఆహా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే చాన్స్ వచ్చింది..' అంటూ ఎవరికి వారు మనసులోనే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత సైనికుల తెగువను ఆకాశానికి ఎత్తేశారు.
అయితే అసలీ సర్జికల్ దాడులు ఎలా జరిగాయో మీకు తెలుసా? దీని వెనుక ఉన్నదెవరు? కథ నడిపించిందెవరు? ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమా? లేక ఒక ప్రణాళిక ప్రకారం దాడులకు పాల్పడ్డారా? ఈ సాహసోపేత దాడుల్లో పాల్గొన్నది ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. పూర్తిగా చదవాల్సిందే!
అమావాస్య రోజు... కటిక చీకటిలో...
కశ్మీర్ లో యూరీ దాడి అనంతరం భారత సైన్యం సర్జికల్ దాడులకు ప్రణాళిక వేసింది. దీనికి ముహూర్తం కూడా అమావాస్య రోజును నిర్ణయించారు. ఆ రోజున వెన్నెల ఉండదు కాబట్టి.. చీకటిలో పని పూర్తిచేయొచ్చని తలపోశారు.
దీంతో గత ఏడాది సెప్టెంబర్ 29న మేజర్ రోహిత్ సూరి నేతృత్వంలోని ఎనిమిది ంది సభ్యుల బృందం ఈ సర్జికల్ దాడులకు వెళ్లింది. ఆపరేషన్ కు సంబంధించి రెక్కీ నిర్వహించిన మేజర్ సూరి తన టీంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ప్రాణాలకు తెగించిన మేజర్ సూరి...
మొదట కేవలం 50 మీటర్ల దూరం నుంచే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అదేసమయంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన సూరి.. ప్రాణాలకు తెగించి ఒంటరిగా ముందుకు దూసుకెళ్లి వారినీ హతమార్చాడు.
48 గంటల ముందే నిఘా...
లాంచ్ ప్యాడ్ ల వద్ద నిఘా కోసం మరో మేజర్ ను నియమించారు. దాడులు నిర్వహించడానికి 48 గంటల ముందే సరిహద్దు రేఖ దాటిన ఈ మేజర్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టాడు.
ఈ మేజర్ కు చెందిన టీం కూడా టార్గెట్ జోన్లపై రెక్కీ నిర్వహించింది. ఒక దశలో తన బృందానికి ముప్పు పొంచి ఉందని తెలిసిన మేజర్ ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్న ఓ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు.
మూడో మేజర్ చాకచక్యంగా...
ఈ ఆపరేషన్ లో మూడో మేజర్ కూడా చాకచక్యంగా వ్యవహరించాడు. ఓ స్థావరంలో నిద్రిస్తున్న జిహాదీలను చంపేసిన ఆ మేజర్ తన టీంను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా దాడి జరుగుతున్న క్రమాన్ని ఎప్పటికప్పుడు తన సీనియర్ అధికారులకు తెలియజేస్తూ వచ్చాడీ మేజర్.
నాలుగో మేజర్... గ్రెనేడ్లతో...
ఇక దాడిలో నాలుగో మేజర్ శత్రువులకు చెందిన ఆటోమేటిక్ వెపన్ స్థావరాన్ని ధ్వంసం చేశాడు. గ్రెనేడ్ దాడులతో ఉగ్రవాదుల స్థావరాలపై ఈ మేజర్ విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
అయిదో మేజర్ కూడా...
నిజానికి సర్జికల్ దాడులు సమయంలో పాక్ ఉగ్రవాదుల నుంచి కూడా తీవ్ర ప్రతిస్పందన ఎదురైంది. నాలుగో మేజర్ బృందంపై రాకెట్ లాంచర్లతో దాడులు చేసేందుకు ముగ్గురు ఉగ్రవాదులు ప్రయత్నించగా, వారిని అయిదో మేజర్ తన బృందంతో తుదముట్టించాడు. దూకుడుగా ముందుకెళ్లి ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టాడు.
పకడ్బందీ ప్రణాళిక.. అమలు...
పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ దాడులు పకడ్బందీ ప్రణాళిక మేరకు జరిగాయి. ఇందులో పాల్గొన్న ప్రతీ సైనిక బృందం, వాటికి నాయకత్వం వహించిన మేజర్లు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. అందువల్లే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న మన సైనికుల్లో ఒక్కరు కూడా ఉగ్రవాదుల చేతిలో అమరులవలేదు. నిఘా టీంకు చెందిన ఓ పారాట్రూపర్ కు మాత్రం గాయాలయ్యాయి.
19 మంది చేసిన సాహసం...
అత్యంత సాహసోపేతంగా సాగిన ఈ సర్జికల్ దాడుల్లో దాదాపు 19 మంది పారా కమాండోలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒక కల్నల్, అయిదుగురు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు నైబ్ సుబేదార్లు, ముగ్గురు హవల్ దార్లు, ఓ లాన్స్ నాయక్ తో పాటు మరో నలుగురు పారాట్రూపర్లు కూడా పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా పారా రెజిమెంట్ లోని 4వ, 9వ బెటాలియన్ కు చెందిన కమాండోలు.
రిపబ్లిక్ డే రోజున పురస్కారాలు...
పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై సాహసోపేతంగా సర్జికల్ దాడులకు తెగబడిన వీరిలో కొందరు పారా కమాండోలు ఇటీవలి రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా పాల్గొన్నారు. 4వ పారా బెటాలియన్ కు చెందిన మేజర్ రోహిత్ సూరికి పరేడ్ సందర్భంగా కీర్తి చక్ర పురస్కారం లభించింది.
అదే దళానికి చెందిన కల్నల్ హర్ ప్రీత్ సందూను యుధ్ సేవా మెడల్ తో సత్కరించారు. పారా రెజిమెంట్ లోని 4వ బెటాలియన్ కు మొత్తం నాలుగు శౌర్యచక్రలు, 13 సేవా మెడల్స్ లభించాయి. సర్జికల్ దాడులకు సంబంధించిన ప్రణాళికను అత్యంత రహస్యంగా, పకడ్బందీగా నిర్వహించడమే కాక, రెండు లక్ష్యాలను ఏకకాలంలో సమర్ధవంతంగా ఎదుర్కొన్న కల్నల్ హర్ ప్రీత్ కు యుధ్ సేవా మెడల్ లభించింది.