సర్జికల్ స్ట్రైక్స్పై శివసేన సంచలన వ్యాఖ్యలు.. మోదీ టార్గెట్గా కీలక ప్రశ్నలు
''పాకిస్తాన్ గడ్డమీదికి చొచ్చుకెళ్లిమరీ ఉగ్రస్థావరాలను నేలకూల్చాం.. ఈ దెబ్బతో దాయాది దేశం దారికొచ్చింది.. ఇకపై ఇండియా మీద దాడి చేయాలంటే టెర్రరిస్టులు వణికిపోయే పరిస్థితి నెలకొంది.. ఇదంతా మా ఘనతే..'' అంటూ ప్రధాని మోదీ, ఎన్డీఏ అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల టైమ్ లో 'సర్జికల్ స్ట్రైక్' అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. అయితే నిజంగా సర్జికల్ స్ట్రైక్స్ ఉద్దేశం నెరవేరిందా? మోదీ చెప్పినట్లు పాక్ ఆగడాలకు అడ్డుకట్టపడిందా? టెర్రిరిస్టు దాడులు ఆగాయా? అంటే ముమ్మాటికీ అలా జరగలేదనే బదులిస్తోంది శివసేన పార్టీ. టార్గెట్ ను సాధించడంలో సర్జికల్ స్ట్రైక్స్ పూర్తిగా ఫెయిలయ్యాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అందుకు బలమైన కారణాలను కూడా ప్రస్తావించింది.
కొత్త సంవత్సరం తొలిరోజే రక్తపాతం..
దేశమంతా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటుండగా, జమ్మూకాశ్మీర్ లోని పాకిస్తాన్ సరిహద్దులో మాత్రం భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో విధ్వంసం చేసేందుకు టెర్రరిస్టులు చొరబడ్డారన్న సమాచారంతో ఆర్మీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఎల్ఓసీని ఆనుకుని ఉండే రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వారిలో మహారాష్ట్రకు చెందిన సందీప్ రఘునాథ్ సావంత్ అనే జవాన్ కూడా ఉన్నారు. సావంత్ మరణాన్ని హైలైట్ చేస్తూ శివసేన పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా‘ శనివారంనాటి ఎడిటోరియల్ లో ఒక వ్యాసాన్ని రాసింది.
బాధ్యులు ఎవరు?
‘‘కొత్త సంవత్సరం మొదటిరోజే సతారా జిల్లాకు చెందిన చెందిన సందీప్ సావంత్, మరో ఇద్దరు సైనికులు కాశ్మీర్లో బలిదానం చేశారు. డిసెంబర్ నుంచి జనవరి ప్రారంభందాకా మహారాష్ట్రకే చెందిన ఎనిమిది మంది జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. దీనికి మహారాష్ట్రలోని మహా వికాస్ అగాధీ ప్రభుత్వం బాధ్యత వహించదు.. ముమ్మాటికీ ప్రధాని మోదీది, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత''అని సామ్నాలో రాశారు.
భ్రమలు కల్పిస్తున్నారు...
సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ గడ్డపై ఉగ్రవాదులు అంతమయ్యారని, ఇకపై ఇండియా సేఫ్ గా ఉంటుందంటూ బీజేపీ నేతలు ప్రజల్లో భ్రమలు కల్పించారని, 2016 తర్వాత వీరమరణం పొందుతున్న జవాన్ల సంఖ్య పెరిగిందని శివసేన ఆరోపించింది. సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ లో సాధరాణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్న శివసేన.. ఆర్టికల్ 370 రద్దును మాత్రం సమర్థించింది. జమ్మూకాశ్మీర్ లోని ఉరి సెక్టార్లోని ఆర్మీ క్యాంపుపై దాడికి ప్రతీకారంగా ఇండియా.. 2016, సెప్టెంబర్ 29న నియంత్రణ రేఖ వెంబడి పాక్ వైపున్న ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేయడం తెలిసిందే.