ఉగ్ర కాల్పులు: సర్జికల్ స్ట్రైక్స్ హీరో లాన్స్ నాయక్ సందీప్ వీర మరణం
శ్రీనగర్: గత కొంత కాలం క్రితం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్లో పాల్గొన్న ఓ జవాను వీర మరణం పొందారు. లాన్స్ నాయక్ సందీప్ సింగ్ అనే జవానును ఉగ్రవాదులు కాల్చి చంపేశారు.
జమ్మూకాశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకుంటుండగా సోమవారం జరిగిన కాల్పుల్లో సందీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఆపరేషన్లో సైన్యం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చింది.
బుల్లెట్ గాయాలైన సందీప్ సింగ్కు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి హుటాహుటిన 92 బేస్ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని, తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారని కల్నల్ రాజేశ్ కలియా వెల్లడించారు. మంగళవారం భారత సైన్యం సందీప్ సింగ్కు ఘన నివాళులర్పించింది.
Srinagar: Wreath-laying ceremony of Indian Army's Lance Naik Sandeep Singh, who lost his life in action during an anti-infiltration operation in Jammu & Kashmir's Tangdhar sector yesterday. pic.twitter.com/LbkRr63sqC
— ANI (@ANI) September 25, 2018
ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించారు. పూర్తి మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా, 2016 సెప్టెంబరులో భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడుల్లో సందీప్ సింగ్ పాల్గొన్నారు. 30ఏళ్ల సందీప్ సింగ్ 2007లో ఆర్మీలో చేరారు. ఆయనది పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా కోట్లా ఖుర్ద్ గ్రామం. సందీప్ సింగ్కు భార్య ఉన్నారు.