ఆరెస్సెస్కు సర్జికల్ స్ట్రయిక్ క్రెడిట్, పాక్కు ధీటుగా: పారికర్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాల పైన ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్ దాడుల క్రెడిట్ను ఒకింత కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్కు ఇచ్చారు. ఆయన సోమవారం నాడు మరోసారి ఈ దాడుల పైన స్పందించారు.
మహాత్మా గాంధీ పుట్టిన ఊరి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గోవా నుంచి తాను వచ్చానని చెప్పారు. తమ ఇద్దరి సమీకరణాలు వేరు అయినా మెరుపుదాడుల విషయంలో ఏకాభిప్రాయం కుదరడానికి బహుశా ఇద్దరూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శిక్షణ పొంది ఉండటమే కారణం అయి ఉండవచ్చునని చెప్పారు.
తద్వారా స్ఫూర్తి ఆరెస్సెస్ అని చెప్పకనే చెప్పారు. చిన్ననాటి నుంచే మోడీ, పారికర్ ఆరెస్సెస్ శిక్షణ పొందారు. తాము స్వయం సేవకులమైనందుకు గర్వపడుతున్నామని వీరు ఇరువురు అనేక సందర్భాల్లో వెల్లడించారు.
యూరీలో ఆర్మీ స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాక సెప్టెంబర్ 29న భారత బలగాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, పలువురు ఉగ్రవాదుల్ని హతమార్చిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ పైన..
పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా వాళ్లకు మన ఆర్మీ ధీటైన సమాధానం ఇస్తోందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తాజాగా ఓ జవాన్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పారు. గత అయిదారేళ్లుగా వందల సంఖ్యలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయన్నారు.
అయితే ఇప్పుడు వాళ్లు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ అన్నిసార్లు మనం గట్టిగా జవాబు ఇస్తున్నామని చెప్పారు. కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబటి ఉన్న రాజౌరి సెక్టారులో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో యూపీలోని సంభల్ జిల్లాకు చెందిన సుదీష్ కుమార్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. దానికి బదులుగా భారత దళాలు కూడా కాల్పులు జరిపాయన్నారు.