సరోగసీ బిల్లు 2019 : కీలక సవరణలకు ప్రతిపాదన... వారిని కూడా అనుమతించాలన్న ప్యానెల్..
సరోగసి(రెగ్యులేషన్) బిల్లు 2019కి 23 మంది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 15 సవరణలు సూచించింది. అందులో కీలక అంశమేంటంటే.. సరోగసీకి ఒప్పుకునే మహిళలు కేవలం దగ్గరి బంధువులే అయి ఉండాల్సిన అవసరం లేదని, ఇష్టపూర్తిగా ఒప్పుకునే ఏ మహిళనైనా సరోగసీకి అనుమతించాలని సూచించింది. అంతేకాదు, 35-45 ఏళ్ల మధ్యలో ఉండే ఒంటరి మహిళలైన వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలకు కూడా సరోగసీ ద్వారా పిల్లలను పొందేందుకు అనుమతించాలని కోరారు.
ఇన్ఫర్టిలిటీ ఆధారంగా సరోగసీపై అభ్యంతరం..
సరోగసీ బిల్లులో ఇన్ఫర్టిలిటీకి ఇచ్చిన నిర్వచనంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పార్లమెంట్ ప్యానెల్ దాన్ని తొలగించాలని సూచించింది. బిల్లులో పొందుపరిచిన ప్రకారం.. ఇన్ఫర్టిలిటీ అంటే ఐదేళ్ల అసురక్షిత సంభోగం తర్వాత కూడా స్త్రీ గర్భం దాల్చలేకపోవడం. దాన్ని ఆధారంగా చేసుకుని సరోగసీకి అనుమతినివ్వడం సరికాదని ప్యానెల్ పేర్కొంది. పిల్లల కోసం ఐదేళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ సమయం అని పేర్కొంది.
మిగతా సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని..
పుట్టుకతో కొంతమందిలో గర్భాశయం లేకపోవడం, గర్భాశయ సమస్యలు, క్యాన్సర్ కారణంగా గర్భాశయాన్ని తొలగించడం, ఫైబ్రాయిడ్లు తదితర సమస్యలతో కొంతమందికి గర్భం దాల్చే అవకాశం ఉండదని ప్యానెల్ పేర్కొంది. కాబట్టి కేవలం ఇన్ఫర్టిలీటీని ఆధారంగా చేసుకుని సరోగసీకి అనుమతినివ్వడం సరికాదని సూచించింది. కాబట్టి సోగసీకి ఇన్ఫర్టిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలని కోరడం అన్ని కేసుల్లో సమంజసం కాదని తెలిపింది.
ఆరోగ్య భీమా పెంపు..
సరోగసీకి ఒప్పుకునే మహిళకు ఆరోగ్య భీమాను 16 నెలల నుంచి 36 నెలలకు పెంచాలని ప్యానెల్ ప్రతిపాదించింది. అలాగే కేవలం దగ్గరి బంధువులైన మహిళల ద్వారా మాత్రమే సరోగసీ పొందాలన్న నిబంధన పెట్టడం సరికాదని ప్యానెల్ అభిప్రాయపడింది. తద్వారా మాతృత్వాన్ని ఆస్వాదించాలనుకునే ఎంతోమంది మహిళల కోరిక నెరవేరదని అన్నారు. కాబట్టి ఆ నిబంధనను తొలగించి.. ఇష్టపూర్తిగా ఒప్పుకునే ఏ మహిళనైనా సరోగసీకి అనుమతించాలని కోరారు.
ఒంటరి మహిళలకు సరోగసీకి అనుమతివ్వాలని..
వింతతువులు లేదా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకు ఎందుకు సరోగసీకి అనుమతించాలన్నది కూడా ప్యానెల్ వివరించింది. మన సమాజంలో వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళ గర్భం దాల్చడాన్ని కళంకంగా చూస్తారని.. కాబట్టి అలాంటివారిని సరోగసీకి అనుమతించకపోతే వారు మాతృత్వాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతారని చెప్పుకొచ్చింది.
మెజిస్ట్రేట్ బర్త్ సర్టిఫికెట్
సర్రోగేట్ తల్లి యొక్క శ్రేయస్సు మరియు సంరక్షణకు అవసరమైన పోషకాహారం మరియు ప్రసూతి-దుస్తులు మొదలైన వాటిపై ఇతర ఖర్చులకు అయ్యే డబ్బులు పొందేందుకు పరోపకార సరోగసీ నిర్వచనంలో మార్పును కమిటీ సిఫార్సు చేసింది. సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల ప్రయోజనాలను కాపాడేందుకు.. పేరేంటేజ్, చిన్నారుల సంరక్షణకు సంబంధించి మెజిస్ట్రేట్ బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని ప్యానెల్ సూచించింది.
పరోపకార సరోగసీనే సమర్థించిన ప్యానెల్..
పరోపకార సరోగసీని ప్యానెల్ గట్టిగా సమర్థించింది. పరోపకార సరోగసీ అంటే.. పిల్లలు లేని దంపతులకు తన ద్వారా శిశువును పొందడానికి ఎవరైనా మహిళ స్వచ్చందంగా ముందుకురావడం. ఇక కమర్షియల్ సరోగసీ ద్వారా మాతృత్వం ఓ మెకానికల్ పెయిడ్ సర్వీస్ లాగా మారిపోతుందని ప్యానెల్ అభిప్రాయపడింది. అలాంటి సరోగసీ అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా,సరోగసీ బిల్లు రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. నవంబర్ 1,2019లో రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి.. ఇందులో సవరణల కోసం ప్యానెల్ ఇప్పటికి 10 సార్లు సమావేశమైంది. ఎట్టకేలకు బుధవారం ఈ ప్యానెల్ రాజ్యసభ ఛైర్మన్ భూపేంద్ర యాదవ్కు నివేదిక అందజేసింది.