ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీలు పెట్టిన ఖర్చెంతో తెలుసా?: సర్వే బయటపెట్టింది..
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఏకంగా రూ. 5500కోట్లు ఖర్చు చేసినట్లు ఓ సర్వే తెలిపింది.
ఉత్తరప్రదేశ్: ఈరోజుల్లో రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. అందుకే బడాబాబులకు టికెట్లు ఇచ్చి మరీ వారిచ్చే డబ్బుతో పార్టీలను నడిపిస్తుంటారు ఆయా పార్టీల అధినేతలు. ఇవిగాక పార్టీ కార్యక్రమాల కోసం నిధుల సేకరణ కూడా చేపడుతుంటారు.
ఇక ఎన్నికల సమయంలో అయితే పార్టీలు ఖర్చు పెట్టే డబ్బుకు అంతూ పొంతూ ఉండదు. అసలు లెక్కలు పైకి కనిపించకపోయినా.. వేల కోట్ల రూపాయల ధనప్రవాహం మాత్రం ఖాయం. తాజా యూపీ ఎన్నికల్లోనూ ఇదే విషయం మరోసారి స్పష్టమైంది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఏకంగా రూ. 5500కోట్లు ఖర్చు చేసినట్లు ఓ సర్వే తెలిపింది. ఇందులో ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు రూ.వెయ్యి కోట్లు కాగా, భారీ ప్రచార సభల ఏర్పాట్లకు.. భారీ స్క్రీన్లు, వీడియో వ్యాన్లు, ఎలక్ట్రానిక్ మెటీరియల్, వంటి వాటికి రూ.4500కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
మొత్తం మీద ఒక్కో రాజకీయ పార్టీ రూ.600 నుంచి రూ.700కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సర్వే ద్వారా తెలిసింది. యూపీలో ఒక్కో ఓటు విలువ రూ.750ఉందని, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికమని సర్వే పేర్కొంది. దేశంలో మూడింట ఒకవంతు ఓటర్లు ఓటుకు డబ్బు లేక మద్యాన్ని తీసుకుంటున్నారని సర్వే వెల్లడించడం గమనార్హం.