స్మార్ట్ ఫోన్ వినియోగం-కొన్ని నిజాలు... మనవాళ్లు ఏ రేంజ్లో వాడేస్తున్నారంటే..
ఇంటర్నెట్,స్మార్ట్ ఫోన్... ఈ రెండూ అందుబాటులోకి వచ్చాక చాలామంది రోజులో ఎక్కువ భాగం వీటితోనే గడిపేస్తున్నారు. బయటి ప్రపంచంతో కంటే వర్చువల్ వరల్డ్లోనే ఎక్కువగా విహరిస్తున్నారు. తిన్నా,పడుకున్నా,ఆఖరికి టాయిలెట్ సీటుపై కూర్చొన్నా చేతిలో స్మార్ట్ఫోన్ ఉండాల్సిందే. ఇక కరోనా లాక్ డౌన్ పీరియడ్లో ఇళ్లకే పరిమితం కావాల్సిన అనివార్యత ఏర్పడటంతో స్మార్ట్ ఫోన్ వినియోగం మరింత పెరిగిపోయింది. ఒకటి కాదు,రెండు కాదు ఒకరోజులో సగటున ఏడు గంటల పాటు భారతీయులు స్మార్ట్ ఫోన్ని వినియోగిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్) ఫర్ వివో ఈ సర్వేని నిర్వహించింది.
సగటున 7గంటలు...
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత్లో స్మార్ట్ ఫోన్ వాడకం సగటున 7 గంటలకు పెరిగినట్లు సర్వే వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్,ఎడ్యుకేషన్,ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువమంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్పై ఆధారపడుతున్నట్లు తెలిపింది. 2019లో ఒకరోజులో సగటున 4.9గంటలుగా ఉన్న స్మార్ట్ఫోన్ వినియోగం ఈ ఏడాది మార్చి నాటికి 11శాతం పెరిగి 5.5గంటలకు చేరినట్లు పేర్కొంది. ఏప్రిల్ నాటికి ఇది మరో 25శాతం పెరిగి 6.9గంటలకు చేరినట్లు తెలిపింది.
ఎందుకింతలా పెరిగింది...
సర్వే ప్రకారం... భారత్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం 75శాతం మంది,సోషల్ మీడియా కోసం 59శాతం మంది,గేమింగ్ కోసం 45శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో కుటుంబ సభ్యులతో గడిపే సమయం గణనీయంగా తగ్గుతోంది. అయితే 79శాతం మంది స్మార్ట్ ఫోన్ కారణంగానే తమ ఆత్మీయులతో టచ్లో ఉంటున్నామని సర్వేలో వెల్లడించడం గమనార్హం. ఎప్పుడూ సెల్ఫోనే చూడటమేనా అని చాలామంది తమను పాయింట్ అవుట్ చేస్తున్నారని దాదాపు 88శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సర్వేలో పేర్కొన్నారు. అలాగే 46శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు... ఒక గంట సంభాషణలో కనీసం ఐదు సార్లు తమ సెల్ఫోన్ను చేతిలోకి తీసుకుని అప్డేట్స్ చేసుకుంటారని తేలింది.
18శాతం మంది మాత్రమే అలా...
ఈ సర్వే కోసం దేశంలోని 8 నగరాలకు చెందిన 15-45 ఏళ్ల వయసున్న 2వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం ఇలాగే పెరిగిపోతే భవిష్యత్తులో మానసిక శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని 70శాతం మంది అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్ను అప్పుడప్పుడు స్విచ్చాఫ్ చేసి పక్కనపెట్టడం ద్వారా తమవాళ్లతో కాస్త ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని 74శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే కేవలం 18శాతం మంది మాత్రమే ఇలా చేస్తున్నారని సర్వేలో తేలింది.