కేరళ కోసం విశాల్ పిలుపు: సూర్య, కార్తీ రూ.25లక్షల విరాళం, నెటిజన్ల ప్రశంసలు
చెన్నై: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతమవుతోంది. వరదల కారణంగా 29మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది నిరాశ్రయులయ్యారు. వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
వర్ష బీభత్సం: వరద నీటిలోనే కేరళ: 29కి చేరిన మృతుల సంఖ్య
ఈ నేపథ్యంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ముందుకొచ్చాడు. మలయాళీలకు సాయం చేసేందుకు 'కేరళ రెస్క్యూ' పేరుతో విరాళాలు సేకరించనున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించాడు.
సాయం కోసం విశాల్ పిలుపు
ఆదివారం చెన్నైలోని మహాలింగపురంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విరాళాలు సేకరిస్తామని విశాల్ తెలిపాడు. వయనాడ్ జిల్లాలో ఉన్న వరద బాధితుల కోసం వాటర్ బాటిళ్లు, సబ్బులు, టూత్ బ్రష్, పేస్ట్, టవల్స్, దుప్పట్లు, బెడ్ షీట్స్, మందులు,బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్, శానిటరీ ప్యాడ్స్, డైపర్స్, దోమతెరలు, డెటాల్ వంటి వస్తువుల్ని అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
కదిలిన సోదరులు
కాగా, ప్రముఖ తమిళ హీరోలు సూర్య, కార్తీలు కూడా కేరళ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఈ సోదరులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల తమిళనాడు రైతు సంఘానికి రూ.కోటి విరాళం ఇచ్చిన వీరు తాజాగా కేరళ ప్రజలకు అండగా నిలబడ్డారు.
రూ.25లక్షల విరాళం
‘కేరళ రెస్క్యూ' పేరుతో విరాళాలు సేకరిస్తున్న నేపథ్యంలో సూర్య, కార్తి కూడా తమ వంతు ఆర్థిక సహాయం అందించారు. కేరళ ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ సంస్థకు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. దీంతో ట్విట్టర్లో నెటిజన్లు వీరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కర్ణాటక రూ.10కోట్ల సాయం
కాగా, వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.4 లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10 లక్షలు పరిహారంగా ఇస్తున్నట్లు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వీటితో పాటు ఆయన స్వచ్ఛందంగా సీఎం సహాయ నిధి నుంచి బాధితులకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కేరళ ప్రభుత్వానికి సాయంగా రూ.10కోట్లు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కేరళ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు.