సూర్యయాన్ సేఫ్ ల్యాండింగ్: బీజేపీ ఎద్దేవా..నెక్స్ట్ టార్గెట్ హస్తిన..చాణక్యుడిని కాను: రౌత్ సంచలనం
ముంబై: మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమైన ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం పూర్తయిందని, ఇక తమ తదుపరి టార్గెట్ హస్తినేనని అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమి కేంద్రంలో కూడా అధికారాన్ని అందుకోవడం ఖాయమని అన్నారు. ఈ దిశగా తాము వ్యూహాలను రూపొందిస్తున్నామని చెప్పారు. బుధవారం ఉదయం ఆయన ముంబైలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
హస్తినలో పాగా వేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు..
కేంద్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. మహారాష్ట్రలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తాము చెబితే.. భారతీయ జనతా పార్టీ నాయకులు పరిహసించారని, ఎద్దేవా చేశారని అన్నారు. తమను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వారి వ్యాఖ్యలను తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, లక్ష్యాన్ని అందుకుని నిరూపించుకున్నామని అన్నారు.
సూర్యయాన్ సేఫ్ ల్యాండింగ్..
మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమి చేపట్టిన సూర్యయాన్ ప్రాజెక్టు.. సేఫ్ గా ల్యాండ్ అయిందని సంజయ్ రౌత్ చెప్పారు. తాము చేపట్టిన ఈ సూర్యయాన్ ప్రాజెక్టు.. సచివాలయంలోని ఆరో అంతస్తు (ముఖ్యమంత్రి ఛాంబర్)పై దిగిందని, ఇది విజయం అక్కడితో ఆగేది కాదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. తాము చేపట్టబోయే తరువాతి ప్రాజెక్టు హస్తినేనని, దీన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ఎంత పెద్ద టాస్క్ అనేది మీరే చూశారుగా..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నంచీ శివసేన ఎన్ని అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నదో మీరే చూశారు కదా.. అని ఆయన విలేకరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాటన్నింటినీ అధిగమించి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని అన్నారు. ఇంత పెద్ద టాస్క్ ను ఎదుర్కొన్నామని, మున్ముందు ఇంకెన్ని అవాంతరాలు ఎదురైనా అవలీలగా అధిగమించేంతటి అనుభవాన్ని సాధించామని అన్నారు. ఈ క్రమంలో బీజేపీ వైఖరి, ఆ పార్టీ నాయకులు అధికారం కోసం ఎంతటి అప్రజాస్వామిక పనులకు కూడా దిగజారుతారనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశామని అన్నారు.
నేను చాణక్యుడిని కాదు.. సైనికుడిని
మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు శివసేనకు అనుకూలంగా మారడంలో సంజయ్ రౌత్ అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ తనను చాణక్యుడిగా పిలుస్తున్నారని, అంత పెద్ద బిరుదుకు తాను అర్హుడిని కానని అన్నారు. తాను కేవలం ఓ సైనికుడిని మాత్రమేనని చెప్పారు. ఢిల్లీ దాకా ప్రభుత్వాన్ని విస్తరించడానికి తాను శక్తివంచన లేకుండా పని చేస్తానని పేర్కొన్నారు.