డ్రగ్స్ లింకులు.. రంగంలోకి నార్కోటిక్స్.. ఎనీ టైమ్ బ్లడ్ టెస్టుకు రెడీ అన్న రియా..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో 'డ్రగ్స్' లింకులను తేల్చేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ,ఈడీ విచారణలు, కేసు చుట్టూ బోలెడు అనుమానాల నడుమ ఎన్సీబీ ఎంట్రీతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఎన్సీబీ ఢిల్లీలో రియా చక్రవర్తి,ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిలపై కేసు నమోదు చేసింది. డ్రగ్స్ను కలిగి ఉండటం, కొనుగోలు చేయడం,వాడకం ఆరోపణలతో వీరిపై కేసులు బుక్ అయ్యాయి.
ఎనీ టైమ్... బ్లడ్ టెస్టుకు రెడీ...
రియా చక్రవర్తి,షోయిక్ చక్రవర్తిలతో పాటు గౌరవ్ ఆర్య అనే పుణేకి చెందిన డ్రగ్స్ విక్రేతను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించనుంది. రియా డ్రగ్స్ చాట్స్ను విశ్లేషించనుంది. మరోవైపు రియా తరుపు న్యాయవాది ఈ కేసుపై స్పందిస్తూ... ఆమెకు అసలు డ్రగ్స్ అలవాటు లేనే లేదని చెప్పారు. ఆమె జీవితంలో ఇప్పటివరకూ డ్రగ్స్ జోలికి పోలేదన్నారు. దీన్ని నిర్దారించేందుకు ఆమె ఎప్పుడైనా రక్త పరీక్షలకు సిద్దమని తెలిపారు.
ఈడీ లేఖతో ఎన్సీబీ...
ఇటీవల మనీ లాండరింగ్ ఆరోపణల విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రియాచక్రవర్తి సెల్ఫోన్ డేటాను విశ్లేషించగా... అందులో 'డ్రగ్స్'కి సంబంధించి పలు ఆధారాలు దొరికాయి. రియా వాట్సాప్ చాట్స్లో డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన మెసేజ్లు కూడా గుర్తించారు. ఆమె సెల్ఫోన్లో సుశాంత్ సింగ్ పేరును 'మిరందా సుశీ'గా సేవ్ చేసుకున్నట్లుగా గుర్తించిన అధికారులు... 'మిరందా' సుశాంత్ మేనేజర్ పేరుగా(శ్యామ్యూల్ మిరందా) నిర్దారించారు. డ్రగ్స్ లింకులపై ఈడీ నార్కోటిక్ బ్యూరోకి లేఖ రాయడంతో తాజాగా ఆ అధికారులు రంగంలోకి దిగారు.
సీబీఐ ప్రశ్నించే ఛాన్స్..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసును ప్రస్తుతం సీబీఐ,ఈడీ,నార్కోటిక్ బ్యూరో సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. అంతకుముందు ముంబై,పాట్నా పోలీసులు దీనిపై విచారణ జరిపారు. ఇటీవలే ఈ కేసును సుప్రీం సీబీఐకి బదలాయించిన నేపథ్యంలో... త్వరలోనే అధికారులు రియా చక్రవర్తిని విచారించే అవకాశం ఉంది. ఇటీవల తమ విచారణలో లభించిన ఆధారాలను ఈడీ సీబీఐకి సమర్పించే అవకాశం కూడా ఉంది. దీంతో డ్రగ్స్ లింకులపై సీబీఐ కూడా రియాను ప్రశ్నించవచ్చు.
Recommended Video
చివరకు ఎక్కడ ముగుస్తుందో...
రియాకు డ్రగ్స్ లింకులు ఉన్నట్లు కథనాలు రావడంతో సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ట్విట్టర్లో స్పందించారు. ఇది నేరపూరితమైన చర్య అని... సీబీఐ తక్షణం ఆమెపై చర్యలు తీసుకోవాలని #RheaDrugsChat అనే హాష్ట్యాగ్తో డిమాండ్ చేసింది. ఇటీవల నిర్మాత సందీప్ సింగ్ దుబాయ్ లింకులపై కూడా పలు అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం సందీప్ సింగ్పై అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఎన్నో అనుమానాలు,ట్విస్టులతో సాగుతున్న ఈ కేసు చివరకు ఎక్కడ ముగుస్తుందో వేచి చూడాలి.