Sushant Singh Death: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన ఎయిమ్స్ వైద్య బృందం
డ్రగ్స్ వ్యవహారంలో పడి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణ మరుగున పడిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ పై ఎలాంటి విషప్రయోగం జరగలేదని సీబీఐకి ఇచ్చిన రిపోర్టులో ఉన్నట్లు సమాచారం.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో అతనికి విషం ఇచ్చి చంపారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసులు ఇది ఆత్మహత్యే అని చెప్పినప్పటికీ... సుశాంత్ సింగ్ రాజ్పుత్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యే అని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో సీబీఐ కేసును టేకోవర్ చేసి విచారణ చేస్తోంది.
కేసు పక్కదారి పడుతోందని..
ఇక సీబీఐ విచారణ చేసిన సమయంలో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో కేసు కాస్త నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేతిలోకి వెళ్లిపోయింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టు చేసింది. దీంతో సుశాంత్ సింగ్ మృతి కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ కుటుంబం తరపున లాయర్ కేసు విచారణ పక్కదారి పడుతోందంటూ సీబీఐ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. దీంతో సీబీఐ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సుశాంత్ సింగ్ కేసును పక్కదారి పట్టించడం లేదని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. హత్య కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది.
విషప్రయోగం జరగలేదు..
తాజాగా ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ సింగ్ శరీరంలో విషం లేదని తేల్చడంతో సీబీఐ ఇక మరో కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఇక ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇవ్వడంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్కు ముంబై హాస్పిటల్లో సరిగ్గా పోస్టుమార్టం నిర్వహించలేదన్న అనుమానం సైతం ఎయిమ్స్ వైద్యులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రియాచక్రవర్తి సుశాంత్ సింగ్ను చాలా వేధించిందని ఒత్తిడికి గురిచేసిందని, అనవసరమైన మందులు శరీరంలోకి ఎక్కించిందని అదే సమయంలో డబ్బులు కోసం కూడా వేధించిందని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఆ కోణంలో విచారణ ప్రారంభించింది.
ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై సీబీఐ
ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ ఫోటోలను తనకు తెలిసిన ఎయిమ్స్ వైద్యుడికి పంపగా.. సుశాంత్ది ఆత్మ హత్యలా లేదని.. గొంతు నులిమి చంపినట్లుగా ఉందని తనతో చెప్పినట్లుగా సుశాంత్ సింగ్ లాయర్ వికాస్ సింగ్ ట్వీట్ ద్వారా గత శుక్రవారం వెల్లడించారు. సుశాంత్ సింగ్ లాయర్ లేవనెత్తిన కొత్త అంశంతో రియా చక్రవర్తి తరపున లాయర్ కూడా మరో కొత్త వైద్య బృందంతో నివేదిక తెప్పించాలని కోరారు. మరోవైపు అన్ని కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.