సుశాంత్ సింగ్ డెత్కేస్: కొత్త కోణం: 80 వేలకు పైగా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్: లింకేంటీ?
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో మరో అనూహ్య కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని షాకింగ్ ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ పాతుకుపోయిందనే విషయం సుశాంత్ సింగ్ డెత్ కేస్ విచారణతోనే బహిర్గతమైంది. బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు, డ్రగ్ పెడ్లర్స్ మధ్య కొనసాగుతోన్న సన్నిహిత సంబంధాలు బాహ్య ప్రపంచం ముందుకు రావడానికి ఈ డెత్ కేస్ కారణమైంది.
ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్: నన్ను బ్లేమ్ చేయొద్దు: ఎవ్వర్నీ వదలను: ఓవర్ నైట్ విలన్
80 వేలకు పైగా ఫేక్ అకౌంట్స్..
ఇదిలా కొనసాగుతుండగానే.. మరో కొత్త కోణాన్ని ముంబై సైబర్ సెల్ పోలీసులు గుర్తించారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఏకంగా 80 వేలకు పైగా నకిలీ అకౌంట్లను సృష్టించినట్లు నిర్ధారించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు వ్యవహారంలో ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను తెలుపుకోవడానికి వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద వాటిని ఉద్దేశపూరకంగా సృష్టించారని గుర్తించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసుల వైఫల్యాన్ని, వారి మీద బురద చల్లడానికే నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను వేదికగా మార్చుకున్నారని పోలీసులు తేల్చారు.
ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసును ఛేదించడంలో ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విషయాన్ని ప్రచారం చేయడానికి వాటిని విస్తృతంగా వినియోగించినట్లు కనుగొన్నారు. దీనిపై ముంబై పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. వేర్వేరు దేశాల్లో వాటిని సృష్టించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వెల్లడించినట్లు ప్రముఖ జాతీయ మీడియా ఒకటి వెల్లడించింది. జూన్ 14వ తేదీ తరువాత వాటిని సృష్టించినట్లు పేర్కొంది.
Recommended Video
వేర్వేరు దేశాల్లో సృష్టించినట్లు..
గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వంపై విదేశీ భాషల్లో తమ కామెంట్లు చేశారని, అవన్నీ ఒకే ట్యాగ్లైన్ కావడం వల్ల సులభంగా గుర్తించామని ఈ ఐపీఎస్ అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. వాటన్నింట్లోనూ #justiceforsushant, #sushantsinghrajput, #SSR అనే కామన్ ట్యాగ్స్ను వినియోగించినట్లు తేలిందని పేర్కొంది. ఇటలీ, జపాన్, పోలెండ్, స్లొవేనియా, ఇండోనేషియా, టర్కీ, థాయ్లాండ్, రొమేనియా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ పోస్ట్ అయినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు ఆ ఐపీఎస్ అధికారి నిర్ధారించినట్లు స్పష్టం చేసింది.
ప్రశాంత్ భూషణ్, ప్రకాశ్ రాజ్ సహా..
ప్రస్తుతం ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. పలువురు ప్రముఖులు ఆ జాతీయ మీడియా వెబ్సైట్ ప్రచురించిన కథనాన్ని సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, దక్షిణాది నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడానికే కొందరు ప్రయత్నిస్తున్నారని, దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించాలని కోరుతున్నారు.
ముందే హెచ్చరించిన సంజయ్ రౌత్..
శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఈ విషయంపై ముందే అనుమానాలను లేవనెత్తారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకుని రావడానికి కుట్ర సాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ డెత్ కేసును ఛేదించడంలో ముంబై పోలీసులు విఫలం అయ్యారనే చెడ్డపేరును తీసుకుని రావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలోనే తేల్చుతామనీ సంజయ్ రౌత్ చెప్పారు. అదే నిజమైతే.. ఇక సీబీఐ దర్యాప్తును కూడా ఏ మాత్రం నమ్మలేమని తేల్చి చెప్పారు.