Sushant Singh Rajput డెత్ మిస్టరీ: మృతి చెంది నేటికి ఏడాది.. సీబీఐ ఏం చెప్తోంది..కథ ఎందాకొచ్చింది..?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి చెంది అప్పుడే ఏడాది పూర్తయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అంటే జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన నివాసంలో మృతి చెందాడు. తొలుత ఆత్మహత్యగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుశాంత్ సింగ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో దాన్ని హత్య కోణంలో విచారణ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Recommended Video
రంగంలోకి మూడు దర్యాప్తు సంస్థలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నేటికి ఏడాది పూర్తయ్యింది.అయితే ఇప్పటికీ తన డెత్ మిస్టరీ వీడలేదు. బాంద్రాలోని తన అపార్టుమెంటులో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక సుశాంత్ సింగ్ మరణంపై రాజకీయాలు ప్రారంభమయ్యాయి. పలు పార్టీలు మైలేజ్ పొందాలని చూశాయి. దీంతో మూడు దర్యాప్తు సంస్థలు సుశాంత్ మృతిపై విచారణ ప్రారంభించాయి. ఇందులో సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలు ఉన్నాయి. అయితే ఏ ఒక్క దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు డెత్ మిస్టరీని చేధించలేకపోయాయి.
సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో...
తొలుత ఆత్మహత్య కేసుగా నమోదు చేసిన ముంబై పోలీసులు, 2020 జూన్ 28వ తేదీన సుశాంత్ సింగ్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల పేర్లను పేర్కొన్నారు. అంతేకాదు రూ.15 కోట్లు సుశాంత్ సింగ్ ఖాతా నుంచి వివిధ ఖాతాలకు బదిలీ అయ్యాయని చెప్పారు. 2020 జూలై 31వ తేదీన ఈడీ కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ పై దర్యాప్తు ప్రారంభించింది. అదే సమయంలో బీహార్ పోలీసులు సుశాంత్ మృతికి గల కారణాలపై విచారణ చేసేందుకు ముంబైకి చేరుకోగా ముంబై పోలీసుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభించలేదు. ముంబై పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో బీహార్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేయడంపై ముంబై పోలీసులు అభ్యంతరం తెలుపుతూ బీహార్ పోలీసులకు సహకరించలేదు.
సీబీఐకి అప్పగించిన నితీష్ ప్రభుత్వం
ఇక ఇది కాస్త రాజకీయరంగు పులుముకుంది. వెంటనే బీహార్ ప్రభుత్వం సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐకి అప్పగించింది. 2020 ఆగష్టు 6వ తేదీన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో రియాచక్రవర్తి ఇతరుల పేర్లను చేర్చింది. వారిని విచారణ చేయడం ప్రారంభించింది. ఇక సీబీఐ ముంబైకు చేరుకుని సుశాంత్ సింగ్ ఇంటిలో సీన్ రిక్రియేట్ చేశారు. అంతేకాదు ఫోరెన్సిక్ రిపోర్టు ఇవ్వాలని ఎయిమ్స్ను కోరింది సీబీఐ. ఇక తమ దర్యాప్తులో భాగంగా మొబైల్ ఫోన్లను చెక్ చేసినప్పుడు అందులో డ్రగ్స్కు సంబంధించిన మరో కొత్త కోణం వెలుగులోకి తీసుకొచ్చింది ఈడీ. ఈడీ రాసిన లేఖతో ఎన్సీబీ రంగంలోకి దిగి డ్రగ్స్ కేసులో విచారణ ప్రారంభించింది. 10 నెలల విచారణ తర్వాత డ్రగ్స్ కేసులో 35 మంది నిందితులను అరెస్టు చేసి 7 కిలోల డ్రగ్స్, మరియు రూ.35 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖాడే చెప్పారు. అయితే సుశాంత్ సింగ్ మృతి దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
అడ్వకేట్ ఏమంటున్నారు..
ఇదిలా ఉంటే సీబీఐ విచారణ ఇంకా పూర్తి కాలేదని అన్ని కోణాల్లో సుశాంత్ సింగ్ మరణంపై విచారణ చేస్తున్నామని చెప్పారు సీబీఐ ఉన్నతాధికారులు. మరోవైపు ఈడీ స్పందించలేదు. ఇక సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యుల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ స్పందించారు. ఇప్పటి వరకు చార్జ్షీట్ దాఖలు చేయకపోవడంపై దర్యాప్తు సంస్థలను తాము తప్పుపట్టడం లేదని ఎందుకంటే ఈ మరణం వెనక పెద్ద మిస్టరీ దాగి ఉందని చెప్పారు. ఇదంతా తలుపులు మూసిఉన్న ఒక గదిలో జరిగిందని... కుటుంబ సభ్యులు కూడా న్యాయం జరుగుతుందన్న ఆశతో సహనంగా వేచిఉన్నారని అడ్వకేట్ వికాస్ సింగ్ చెప్పారు.
మొత్తానికి సుశాంత్ సింగ్ మరణం దేశాన్ని కుదిపేసింది. ఈ రోజున పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్కు నివాళులు అర్పిస్తూ తమతో సుశాంత్ బంధాన్ని నెమరేసుకుంటున్నారు. ఇకనైనా దర్యాప్తు సంస్థలు విచారణ వేగంగా పూర్తి చేసి డెత్ మిస్టరీని చేధించాలని సుశాంత్ సింగ్ అభిమానులు కోరుతున్నారు.