సుశాంత్ ఆత్మహత్య కాదు చంపేశారు.. సీబీఐ ఎంక్వైరీకి ఫ్యామిలీ డిమాండ్.. ఆ డాక్టర్ నుంచి స్టేట్మెంట్..
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై ఆయన సొంత కుటుంబీకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్రెషన్ కారణంగానే అతను చనిపోయాడంటూ వస్తోన్న రిపోర్టులను తోసిపుచ్చారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, కచ్చితంగా ఎవరో చంపేసి ఉంటారని ఆరోపించారు. హీరో మరణించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్లలో డీజీ స్థాయి పోలీస్ అధికారి కూడా ఉండటం గమనార్హం.
మోదీ దిగ్భ్రాంతి.. లోకేశ్ సానుభూతి.. సుశాంత్ మరణం నేపథ్యంలో సంచలన రిపోర్ట్.. హెల్ప్ లైన్లు..
సీబీఐ ఎంక్వైరీ..
గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండానే స్వయంకృషితో బాలీవుడ్ లో రాణించిన సుశాంత్.. స్టార్ హీరో హోదాతోపాటు చేతినిండా సినిమాలున్న తరుణంలోనే అర్థాంతరంగా తనువుచాలించడం కలకలం రేపింది. ముంబైలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ, బాంద్రాలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో సుశాంత్ క్రియేటివ్ మేనేజర్, ఓ ఫ్రెండ్, పనిమనిషి కూడా నివసిస్తున్నట్లు తెలిసింది. ఆదివారం ఉదయం 9 గంటలప్పుడు సుశాంత్ తన సోదరి, మరో స్నేహితుడైన మహేశ్ శెట్టిలతో ఫోన్లో కూడా మాట్లాడారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. పోలీసుల ప్రాధమిక విచారణ, పోస్ట్ మార్టం రిపోర్టుల్లో సుశాంత్ ది ఆత్మహత్యే అని నిర్ధారించినప్పటికీ, కుటుంబీకులు మాత్రం ఇందులో కుట్రకోణం దాగుందని, సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని పట్టుపడుతున్నారు.
దోషుల్ని బయటికి లాగాలి..
సుశాంత్ మృతితో ఆయన సొంత ఊరైన పాట్నా(బీహార్)లోనూ విషాదం నెలకొంది. సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ పాట్నాలో ఉంటుండగా, సోదరి మితూ సింగ్ ఛండీగఢ్ లో నివసిస్తున్నారు. మరణవార్త తెలిసిన తర్వాత మితూ ముంబైకి చేరుకోగా, మిగతా బంధువులంతా పాట్నాలోని ఇంటికి వెళ్లారు. సుశాంత్ మేనమామ(అమ్మ తరఫు) ఆర్సీ సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘మావాడు ఆత్మహత్య చేసుకునే రకంకాదు. ఇందులో ఏదో మతలబు ఉంది. కుట్రపూరితంగానే సుశాంత్ ను హత్య చేసి ఉంటారు. దీనిపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలి. దోషుల్ని చట్టం ముందు నిలబెట్టాలి''అని ఆర్సీ సింగ్ అన్నారు.
ఆ రెండూ హత్యలే..
సుశాంత్ చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్ కూడా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. 14 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడటంతో దిశ కన్నుమూశారు. అయితే ఆమెది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించడంతో ఆ వ్యవహారంపై పెద్దగా చర్చ జరగలేదు. సుశాంత్ మేనమామ ఆర్సీ సింగ్ మాత్రం రెండు మరణాలకు ఏదో సంబంధం ఉండి ఉండొచ్చని, ఆ రెండూ హత్యలే అయి ఉండొచ్చని, ఎంక్వైరీ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని అంటున్నారు.
పోలీస్ బావదీ అదే వాదన..
సుశాంత్ మరణం ఇండస్ట్రీకి, సమాజానికి పూడ్చలేని లోటని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. అదే హర్యాణా పోలీస్ శాఖలో అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ)గా పనిచేస్తోన్న ఓపీ సింగ్.. వరుసకు సుశాంత్ బావ అవుతారు. పాట్నాలో సుశాంత్ తండ్రిని పరామర్శించేందుకు వచ్చిన ఓపీ సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. సుశాంత్ ఇంట్లో చోటుచేసుకున్న దృశ్యాలను బట్టి అక్కడ క్రైమ్ జరిగి ఉండొచ్చని, కపటనాటకం బయటపడాల్సి ఉందని సింగ్ అభిప్రాయపడ్డారు.
పప్పూ యాదవ్ ఎంట్రీ..
ఉత్తరాదిలో బాగా ప్రబాల్యమున్న రాజ్ పుత్ కులానికి చెందినవాడు కావడంతో సుశాంత్ మరణం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. పాట్నాలో సుశాంత్ తండ్రి ఉంటోన్న ఇంటికి ఆదివారం ఉదయం నుంచే వివిధ పార్టీల నాయకులు వెళ్లొస్తున్నారు. ఆక్రమంలోనే వివాదాస్పద నేత, జన్ అధికార్ పార్టీ(జేఏపీ) చీఫ్ పప్పూ యాదవ్ సోమవారం సుశాంత్ తండ్రిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ ది కచ్చితంగా హత్యేనని, అతను ఆత్మచేసుకునే అవకాశమే లేదని, దీనిపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
పర్సనల్ డాక్టర్ కోసం..
శాంత్ మృతిపై సమీప బంధువులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పోలీసులు ఇంకా స్పందించలేదు. అయితే అతని మృతి కేసులో మాత్రం బాంద్రా పోలీసులు కేసు దర్యాప్తు వేగాన్ని పెంచారు. సుశాంత్ ఆరు నెలలుగా డిప్రెషన్ తో పోరాడుతున్నారని, ఆ మేరకు పర్సనల్ డాక్టర్ సూచనల్ని పాటిస్తున్నారని, అయితే, రెండు వారాలుగా మందుల్ని వేసుకోవడం మానేశారని వెల్లడైంది. దీంతో పోలీసులు సుశాంత్ పర్సనల్ డాక్టర్ ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. హీరో మానసిక పరిస్థితి, అతను వాడిని మందులు, చనిపోవడానికి ముందు ఇంకేదైనా జరిగిందా అనే వివరాలను డాక్టర్ ను అడిగి తెలుసుకుంటామని, అధికారికంగా స్టేట్మెంట్ రికార్డు చేస్తామని బాంద్రా పోలీసులు తెలిపారు.
Recommended Video
ముంబైలో అంత్యక్రియలు..
హీరో సుశాంత్ మృతదేహానికి ముంబైలోని జుహు కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. శనివారం రాత్రి తర్వాత వెల్లడైన రిపోర్టుల్లో.. అతనిది ఆత్మహత్యేనని, ఊపిరాడక చనిపోయాడని నిర్ధారించారు. ప్రాధమికంగా విషప్రయోగం ఆనవాళ్లు లేనప్పటికీ, మరింత లోతుగా అధ్యనం చేసేందుకు సుశాంత్ అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా, కరోనా లాక్ డౌన్ నిబంధనల కారణంగా సుశాంత్ అంత్యక్రియలు సాదాసీదాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాట్నా నుంచి తండ్రి, ముఖ్యమైన బంధువులు ముంబై చేరుకున్న వెంటనే తంతు ముగించనున్నారు.