సుశాంత్ కేసు .. నటి రియాకు మద్దతు తెలపటం నాకు గుణపాఠం : మంచు లక్ష్మి ఆవేదన
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ద్వారా బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ బాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారిస్తోంది . బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి నటి రియా కారణమని సోషల్ మీడియాలో పెద్దఎత్తున రియా చక్రవర్తిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రియా చక్రవర్తికి మంచు లక్ష్మీ, తాప్సి తదితరులు మద్దతు తెలిపారు. అదే మంచు లక్ష్మికి కొత్త తలనొప్పికి కారణమయ్యింది.
అమాయకురాలిని , సుశాంత్ డ్రగ్స్ కోసం అందర్నీ వాడుకునేవాడు .. బెయిల్ పిటీషన్ లో రియా
రియాకు మద్దతు తెలిపిన మంచు లక్ష్మి .. నెటిజన్లు ఫైర్
రియాకు న్యాయం జరగాలంటూ మంచు లక్ష్మి, తాప్సీపన్ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు .నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని దోషిగా చూపకూడదు .సుశాంత్ విషయంలో నిజం బయటకు వస్తుంది అని నమ్ముతున్నాను అంటూ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంచు లక్ష్మి పై ట్రోల్స్ కు కారణమవుతున్నాయి. రియా కు న్యాయం జరగాలని కోరుతున్న మంచు లక్ష్మి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో న్యాయం జరగాలని ఎందుకు కోరలేదు అంటూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మి పై మండి పడుతున్నారు.
సాటి మహిళగా మద్దతు తెలపటం నేరమా ? ప్రశ్నించిన మంచు లక్ష్మి
మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ స్నేహితులు కాబట్టి, రకుల్, రియాలు మంచి స్నేహితులు కాబట్టి వారిద్దరికీ డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉంది కాబట్టి మంచు లక్ష్మికి కూడా సంబంధం ఉందేమో అన్నట్లుగా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మంచు లక్ష్మిని ఆవేదనకు గురి చేసింది. దీంతో ఆమె సాటి మహిళగా రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకు పెట్టే ఆంక్షలు మీడియాకు వర్తించవా అంటూ మంచు లక్ష్మి వ్యవస్థను నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు.
రియాకు మద్దతు తెలపటం తనకు గుణ పాఠం అంటూ ఆక్రోశం
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై ఆక్రోశం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి మా నోళ్ళు కట్టేస్తున్నారు మరి సిబిఐ, ఈడి, ఎన్సీబీ ల నుంచి సమాచారాన్ని లీక్ చేస్తున్నది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. తనపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి తమ కుటుంబంలో అందరూ టెన్షన్ పడుతున్నారని, అమ్మ చాలా బాధ పడుతుందని రియాకు మద్దతు తెలపటం తనకు గుణపాఠం నేర్పింది అని మంచు లక్ష్మి వాపోయారు. ఇకనుండి తన అభిప్రాయాలు ఏదైనా ఓపెన్ గా వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాను అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.
తనను రచ్చ చెయ్యాలని చూస్తున్నారని ఆగ్రహం
రియాకు మద్దతుగా తాను ట్వీట్ చేసినప్పుడు తనకు వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయని, తనను కూడా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు . ఆ వ్యవహారంలోకి తనను కూడా లాగి రచ్చ చెయ్యాలని చూశారు అంటూ మంచు లక్ష్మీ తెలిపారు. దేశంలో మన ఎకానమీ కొలాప్స్ అయినా, కోవిడ్ లో మనమే నెంబర్ వన్ అయినా అవి ఎవరికీ పట్టవని చెప్పిన మంచు లక్ష్మి వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు అంటూ ఫైర్ అయ్యారు.
Recommended Video
సుశాంత్ మృతి కేసులో నిందితురాలికి మద్దతు తెలపటం మంచు లక్ష్మికి తలనొప్పి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతడి దగ్గర పనిచేసిన మాజీ సిబ్బంది సైతం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు సుశాంత్ విషయంలో డ్రగ్ కోణం కూడా బయటకు రావడంతో రియాపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం రియాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులోనూ, బాలీవుడ్ డ్రగ్స్ కేస్ లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తికి మంచు లక్ష్మి మద్దతు తెలపడమే ఇప్పుడు మంచు లక్ష్మిపై పెద్ద చర్చకు కారణమైంది.