టిపై లోకసభలో షిండే, ఓటేస్తామని సుష్మా: లైవ్ స్టాప్
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం లోకసభలో ప్రసంగించారు. షిండే ప్రసంగిస్తుండగా సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ వెల్లోకి చొచ్చుకెళ్లారు. దీంతో సభాపతి మీరా కుమార్ నిమిషంలోనే సభను వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం వచ్చే పరిణామాల పైన కేంద్రం అధ్యయనం చేసిందని షిండే సభలో అన్నారు. భాగస్వాములందరికీ తగినంత న్యాయం చేసే ప్రయత్నం చేశామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేస్తామని షిండే ప్రకటించారు. అయితే సీమాంధ్ర నేతలు అడ్డుకోవడంతో సభ వాయిదా పడినట్లు ప్రకటించారు. అయితే స్పీకర్ వాయిదా వేయకుండా ప్రత్యక్ష ప్రసారాలను మాత్రమే నిలిపివేశారు. లోకసభలో ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా అంతకుముందు షిండే మాట్లాడుతూ... బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ లోక్ సభలో తెలంగాణ బిల్లు చర్చలో ఏర్పడే ఆటంకాలను స్పీకర్ తొలగిస్తారని అన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించేవారు, వ్యతిరేకించేవారు ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయం వెల్లడించే అవకాశం ఉందని అన్నారు. బల్లుపై ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: సుష్మా స్వరాజ్
తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ చెప్పారు. సభలో చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతుగా తాము ఓటేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తామన్నారు.
సెంట్రల్ హాలులోకి చంద్రబాబు
తెలంగాణ ముసాయిదా బిల్లు లోకసభలో చర్చ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్లమెంటు సెంట్రల్ హాలులోకి వెళ్లారు.
ధర్నాలో అశోక్ బాబు
బిల్లు దేశ రాజకీయాల్లో చరిత్ర లిఖిస్తుందని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు తెలిపారు. ఇప్పటికైనా జాతీయ పార్టీలు కళ్లు తెరిచి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ఆయన సూచించారు. కర్ణుడిలా బిజెపి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం కలసి ఉంటేనే మంచిదని సీమాంధ్రులతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. కులాలు, మతాలు, డబ్బు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
మరోసారి ఉద్యోగులు జీతాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులంతా రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సమ్మె చేస్తుండగా లేనిది.. నేతలు కళ్లు ముసుకుని కూర్చుంటే ఎలా అని అన్నారు. బిజెపి ఓటు బ్యాంకు రాజకీయాలు మాని దేశ ఐక్యతను దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. కర్ణుడు చేసిన ధర్మయుద్ధంలా బిజెపి న్యాయబద్ధమైన పాత్ర పోషించాలన్నారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ వ్యవస్థకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని తెలిపారు. టి బిల్లును వ్యతిరేకిస్తే బిజెపికి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినట్లే అన్నారు.
హైకోర్టులో పిల్
విభజన ప్రక్రియ సరిగా లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పివి కృష్ణయ్య మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిలో భాగంగా లోక్సభ, రాజ్యసభ కార్యదర్శులతోపాటు, హోంశాఖ, లా, కేబినెట్ సెక్రటరీలు, రాష్ట్ర సీఎస్కు నోటీసులు జారీ చేయడం జరిగింది.
రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విభజనపై కేంద్రం ఏకపక్షంతో వెళుతోందని, పూర్తి స్థాయి బిల్లు లేదని కృష్ణయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు కేంద్రం అవలంభిస్తున్న విధానాలను కూడా పిటిసన్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు.