టి బిల్లు ఇంకా రాలేదు: షిండే, టిడిపి పుస్తకాల పంపిణీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ఇంకా రాష్ట్రపతి నుండి రాలేదని, అది వచ్చాక దానిని పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశ పెట్టేది చెబుతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు. రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు పెడతారనే కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.
సీమాంధ్ర టిడిపి పుస్తకాల పంపిణీ
సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లులోని అంశాలతో కూడిన పుస్తకాలను పార్లమెంటు ఆవరణలో వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులకు పంచారు. 35 పేజీలతో కూడిన ఈ పుస్తకాలను పలువురికి పంచారు. బిల్లులోని లోపాలను ఎంపీలు అందులో పొందుపర్చారు.
బిజెపి నేతలకు ప్రధాని విందు
భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ నెల 12వ తేదీన విందుకు ఆహ్వానించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడతారనే కథనాలు వస్తున్న నేపథ్యంలో ముందు రోజు ప్రధాని విందు ప్రాధాన్యత సంతరించుకుంది.త
బడ్జెట్ పైన టిడిపి నేత గాలి
రాష్ట్ర బడ్జెట్ అప్పుచేసి పప్పుకూడు అన్నట్లుగా ఉందని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. మంత్రులు కాంగ్రెసు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అల్లుళ్ల మాదిరిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు నేతలుపదేళ్ల ప్రజాధనం తిని షుగర్ తెచ్చుకున్నారని, టిడిపి అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుందన్నారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టిన దాఖలాలు తన అనుభవంలో చూడలేదని మరో సీనియర్ అశోక గజపతి రాజు అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు కోరారు. బిఎసి సామావేశంలో కూడా ఎలక్షన్ ఫీవర్ కనిపించిందని అన్నారు.
టి బిల్లుపై పయ్యావుల
తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్కు చేరకముందే అఖిల పక్షంలో బిల్లు ప్రతులు పెడితే రాష్ట్రపతి ఎందుకు జోక్యం చేసుకోలేదని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. తమ కష్టాలు పట్టించుకోనప్పుడు తెగబడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రిటిష్ వారి విభజించు - పాలించు వాసనలు పార్లమెంటు, రాష్ట్రపతి భవన్లో కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంపుగా కాకుండా రాజ్యాంగ సంరక్షకుడిగా ఉండాలన్నారు. తమ మనోభావాలు గౌరవించకుంటే తాము వారిని గౌరవించమన్నారు.