15ఏళ్లకే పీహెచ్డీ సాధించిన కార్మికుడి కూతురు
లక్నో: ఓ పారిశుద్ధ్య కార్మికుడి కూతురు రికార్డు సృష్టించింది. ఆర్థిక ఇబ్బందుకులకు తలవంచకుండా అతిచిన్న వయస్సులోనే పీహెచ్డీ సాధించింది. ఆమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 15ఏళ్ల సుష్మా వర్మ.
ఏడేళ్ల వయస్సులోనే ఆమె 10వ తరగతి పాసైంది. 13 ఏళ్లకు లక్నో విశ్వవిద్యాలయం నుంచి మైక్రోబయాలజీలో పీజీ పూర్తి చేసింది. ఇక 15 ఏళ్లకు బాబాసాహెబ్ భీమ్రావ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్కాలర్గా నమోదైంది. దీంతో దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన పీహెచ్డీ విద్యార్థిగా ఆమె ఘనత సాధించింది.
ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చినా ఆమె తన విద్యాభ్యాసంలో వెనకడగు వేయలేదు. ఆమె తండ్రి ఓ పారిశుద్ధ్య కార్మికుడు. ఆమె చుట్టూ చదువును ప్రోత్సహించే వాతావరణం కూడా లేదు. అయినా, ఆమె చదువుపై తనకున్న మక్కువను చంపుకోకుండా ముందడుగు వేసింది.
ప్రతిభతో లక్ష్యసాధనలో దూసుకుపోతోంది. డాక్టర్ కావాలని ఆమె ఉత్తర్ప్రదేశ్ కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్కు దరఖాస్తు చేసుకున్నా.. కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలన్న నిబంధన కారణంగా ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
ఈ విషయంపై సుష్మ మీడియాతో మాట్లాడుతూ.. చదువుకు సామర్థ్యం, ప్రతిభ ప్రాతిపదిక ఉండాలె తప్ప, వయస్సు కాదని పేర్కొంది. వైద్యురాలిని కావాలన్నది తన సంకల్పమని, అయితే, ఇందుకు మరో రెండేళ్లు ఆగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, సుష్మ ప్రతిభను చూసి ముగ్ధుడైన భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్సీ సాబ్తీ ఆమె తండ్రి తేజ్ బహదూర్ (51)కు యూనివర్సిటీలో పారిశుద్ధ్య సూపర్వైజర్గా ఉద్యోగం ఇచ్చారు.
ఇది ఇలా ఉండగా, సుష్మ ప్రతిభ దేశంలోని విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకమని స్థానికులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కించుకుంది. ఆమె సోదరుడు కూడా 14ఏళ్లకే బిసిఏ పూర్తి చేయడం గమనార్హం.