పాక్ హిందువులను ఆదుకుంటాం: సుష్మా
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉండే హిందువులను, ఇతర మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం నాడు చెప్పారు.
పాక్లో హిందువులు వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంజాబ్ పార్లమెంటు సభ్యులు అవినాశ్ రాయ్ ఖన్నా రాజ్యసభలో చెప్పారు.
దీనిపై కేంద్రమంత్రి సుష్మా స్పందించారు. పాకిస్తాన్లోని హిందువుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పాకిస్తాన్లోని మైనార్టీలు, హిందువుల సమస్యల పైన ఇప్పటికే ఆ దేశ ప్రతినిధులతో చర్చించామన్నారు. గతంలోను వీటికి సంబంధించి నివేదికలను కేంద్రానికి అందించామన్నారు.
దీనిపై మరోసారి సమావేశమై తగిన చర్యలు చేపడతామన్నారు. పాక్లో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పైన అవగాహన ఉందని చెప్పారు.
163 మంది జాలర్లను విడుదల చేసిన పాక్
పాకిస్థాన్లో ఖైదీలుగా ఉన్న భారత్కు చెందిన 163 మంది జాలర్లను నేడు ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల రష్యాలోని వూఫాలో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్షరీఫ్ చర్చించుకున్న అంశాల్లో జాలర్ల విడుదల ఒకటి. 15రోజుల్లోగా జాలర్లందరిని విడుదల చేయనున్నట్లు పాక్ ప్రకటించింది.
ఇందులో భాగంగానే నేడు 11ఏళ్ల బాలుడు సహా, 163మందిని విడుదల చేశారు. వాఘా సరిహద్దు వద్ద వారిని భారత అధికారులకు అప్పగించారు. త్వరలోనే మిగిలిన వారిని విడుదల చేయనున్నట్లు పాక్ తెలిపింది. తాజా నివేదిక ప్రకారం, ఇంకా 355మంది జాలర్లు పాక్ జైళ్లల్లో బందీలుగా ఉన్నారు.