వరమహాలక్ష్మి పండగ ముతైదువు సుష్మాస్వరాజ్: ఒక్క మాట కోసం, బళ్లారి రెడ్డి బ్రదర్స్ దూరం!
బెంగళూరు: 20 ఏళ్ల క్రితం, 1999లో కర్ణాటకలోని బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి సోనియా గాంధీ మీద పోటీ చేసిన సుష్మాస్వరాజ్ ఓటమిపాలైనా బళ్లారి ప్రజల గుండెల్లో వరమహాలక్ష్మి పండగ ముతైదువుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. మాజీ మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్, బళ్లారి శ్రీరాములు లాంటి నాయకులకు సుష్మాస్వరాజ్ అమ్మ అయ్యారు. బళ్లారి ప్రజలతో మంచి అనుబంధం ఉన్న సుష్మాస్వరాజ్ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో బళ్లారికి చేరుకుని వరమహాలక్ష్మి వ్రతం పండగను ఎంతో భక్తి శ్రధ్దలతో జరుపుకునేవారు.
బళ్లారి ప్రజల కుమార్తెగా, కోడలుగా ప్రతి ఇంటిలో సుష్మాస్వరాజ్ కుటుంబ సభ్యురాలైనారు. వరమహాలక్ష్మి వ్రతం పండగకు రెండు రోజుల ముందు కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మంగళవారం పొద్దుపోయిన తరువాత మరణించారని తెలుసుకున్న బళ్లారి ప్రజులు విషాదంలో మునిగిపోయారు.
దేశం మీద విదేశీ యుద్దం
బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి 1999లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ మీద సుష్మాస్వరాజ్ (బీజేపీ) పోటీ చేశారు. నువ్వానేనా అంటూ సోనియా గాంధీ, సుప్మాస్వరాజ్ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే 56 వేల ఓట్ల తేడాతో సుష్మాస్వరాజ్ ఓడిపోయారు. ఎంపీగా గెలిపించిన ప్రజల గురించి సోనియా గాంధీ పట్టించుకోలేదు. బళ్లారి వైపు సోనియా గాంధీ కన్నెత్తి చూడలేదు. అయితే 1999 నుంచి బళ్లారి ప్రజలతో సుష్మాస్వరాజ్ కు ఎంతో అనుబంధం ఉంది. నిత్యం బళ్లారి ప్రజలను పలకరిస్తూ రాజకీయ కోణంలో చూసే వారికి సుష్మాస్వరాజ్ పెద్ద షాక్ ఇచ్చారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వరమహాలక్ష్మి వ్రతం పండగకు సుష్మాస్వరాజ్ బళ్లారి వవ్చి అందరిని ఆప్యాయంగా పలకరించేవారు.
12 ఏళ్లు ఇచ్చిన మాట తప్పని అమ్మ
1999 లోక్ సభ ఎన్నికల సందర్బంగా బళ్లారి ప్రజలకు సుష్మాస్వరాజ్ ఎంతో దగ్గర అయ్యారు. ప్రతి సంవత్సరం వరమహాలక్ష్మి వ్రతం పండగ సందర్బంగా బళ్లారి లోని డాక్టర్ బికే. శ్రీనివాసమూర్తి, డాక్టర్ సుందర్ ఇంటికి చేరుకుని సుష్మాస్వరాజ్ ప్రత్యేక పూజలు చేసేవారు. అనంతరం మాజీ మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగే సామూహిక ఉచిత వివాహ శుభకార్యాలయాల్లో నూతన వధూవరులను ఆశీర్వదించేవారు. ఇలా 12 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా బళ్లారి చేరుకుని వరమహాలక్ష్మి వ్రతం పండగ జరుపుకున్నారు. 13వ సంవత్సరంలో సుష్మాస్వరాజ్ అతి సమీప బంధువు చనిపోవడంతో శుభకార్యాలకు దూరంగా ఉండాలని (ముట్టు) వరమహాలక్ష్మి పండగకు దూరంగా ఉన్నారు.
సుష్మాకు దూరమైన రెడ్డి బ్రదర్స్
ప్రతి సంవత్సరం హెలికాప్టర్ లో బళ్లారి చేరుకుని వరమహాలక్ష్మి వత్రం పండగ జరుకుని పట్టుచీర, పసుపు కంకుమ తీసుకుని బళ్లారి ప్రజలను ఆశీర్వదించి సుష్మాస్వరాజ్ వెళ్లేవారు. అయితే అక్రమ గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు పోవడం, కేసులో బళ్లారి శ్రీరాములు, గాలి బ్రదర్స్ మీద ఆరోపణలు రావడంతో సుష్మాస్వరాజ్ షాక్ కు గురైనారు. ఇంత కాలం తనను తల్లిగా ఆదరించి పసుపు కుంకుమ ఇచ్చిన గాలి సోదరులకు ఆమె దూరం కావాలని నిర్ణయించారు.
పార్టీ ఇమేజ్ డ్యామేజ్
2011 నుంచి బళ్లారి గాలి సోదరులకు దూరంగా ఉండాలని అప్పటి లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మాస్వరాజ్ నిర్ణయించారు. అదే సమయంలో అనుబంధాలకంటే పార్టీ ఇమేజ్ ముఖ్యమని బీజేపీ సీనియర్ నాయకులు చెప్పడంతో బళ్లారి గాలి సోదరులకు సుష్మాస్వరాజ్ మరింత దూరం అయ్యారు. తల్లి లాంటి సుష్మాస్వరాజ్ దూరం అయిన రోజు నుంచి గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు అన్ని అపశకునాలు ఎదురౌతున్నాయి. అయితే సుష్మాస్వరాజ్ ను బళ్లారికి పిలుచుకుని వెళ్లి వరమహాలక్ష్మి వ్రతం పండగ రోజు పసుపు కుంకుమ ఇవ్వాలని చివరి వరకు ప్రయత్నాలు చేసిన గాలి సోదరులకు చివరికి వరమహాలక్ష్మి పండగకు రెండు రోజుల ముందు నిరాశ మిగిలింది.
బళ్లారి ముతైదు మహిళ
క్రమం తప్పకుంగా ప్రతి సంవత్రం బళ్లారిలో శ్రావణమాసంలో వరమహాలక్ష్మి వ్రతం జరుపుకుని నిండు ముతైదువుగా పసుప కుంకుమ తీసుకుని వెళ్లే సుష్మాస్వరాజ్ ఒక సంవత్సరం మాత్రం ఆ పండగకు హాజరుకాలేదు. నుదిటి మీద నిండుగా కుంకుమ పెట్టుకుని బళ్లారి వచ్చి పసుపు కుంకుమ తీసుకునే మా ఆడపడుచుకు ఎవరో దిష్టి పెట్టారని, అప్పటి నుంచి అన్నీ అపశుకునాలు ఎదెరౌతున్నాయని బళ్లారి ప్రజలు భావించారు. ఎలాగైనా ఈ సంవత్సరం వరమహాలక్ష్మి పండగకు ఆహ్వానించి అమ్మ సుష్మాస్వరాజ్ తో వ్రతం చేయించాలని గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, బళ్లారి ప్రజలు ప్రయత్నించారు. అయితే కేవలం వరమహాలక్ష్మి వ్రతం పండగ రెండు రోజుల ముందు సుష్మాస్వరాజ్ లేరని తెలుసుకున్న గాలి సోదరులు, బళ్లారి ప్రజలు విషాదంలో మునిగిపోయారు.