మోడీ, రాహుల్, ఒబామాలకు లేని అరుదైన ట్విట్టర్ రికార్డ్.. సుష్మా స్వరాజ్కు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం అడిగితే వెంటనే స్పందిస్తారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. ఆమె కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ట్విట్టర్లోను చాలా చురుగ్గా ఉన్నారు.
పాస్పోర్టులు పోగొట్టుకొని ఇబ్బందిపడ్డవారు, ఇతర దేశాల్లో వివిధ రకాలుగా చిక్కుకున్నారు, ఇతర అపాయ సమయంలో ట్వీట్ చేస్తే చాలు ఆమె స్పందిస్తారు. వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకుంటారు. కొన్నిసార్లు తన సమయస్ఫూర్తి, హాస్య స్ఫూర్తితో నవ్వు తెప్పించారు. ట్విట్టర్ ద్వారా ఆమె చేసే సాయానికి పాకిస్తానీయులు కూడా ఫిదా అయ్యారు.
అలాంటి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. ఏ ఇతర రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, సినిమా తారలకు లేని రికార్డ్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీలే కాదు.. బాలీవుడ్ నటులు, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, ఫుట్బాల్ స్టార్ రొనాల్డోలకూ ఈ రికార్డ్ లేదు.
ట్విట్టర్లో నాయకులను, సినిమా తారలకు, క్రీడాకారులను లక్షలాది మంది ఫాలో అవుతుంటారు. వారి మాత్రం పదులు, వందల్లో కొంతమందిని ఫాలో అవుతుంటారు. కాని సుష్మా స్వరాజ్ మాత్రం ఎవరినీ ఫాలో కావడం లేదు.
ట్విట్టర్లో సుష్మా స్వరాజ్ను 1.21 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. 6,100 సార్లు ట్వీట్లు చేశారు. మోడీ, బరాక్ ఒబామా, ఒబామా, రొనాల్డో, అమితాబ్ బచ్చన్ ఖాతాలను అనుసరిస్తున్న వారి సంఖ్య ఇంతకన్నా ఎక్కువే. కానీ వీరు ఎంతో కొంతమందిని అనుసరిస్తున్నారు.
కానీ సుష్మా స్వరాజ్ మాత్రం ఎవరినీ అనుసరించడం లేదు. ఒక ట్విటర్ హ్యాండిల్కు 1.21 కోట్ల ఫాలోవర్స్ ఉండగా ఫాలోయింగ్ ఎవరూ లేకపోవడమే రికార్డ్. మోడీకి 45.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, రాహుల్ గాంధీకి 8.62 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మోడీ 2,122 మందిని ఫాలో అవుతుండగా, రాహుల్ గాంధీ 206 మందిని ఫాలో అవుతున్నారు. సుష్మా మాత్రం ఒక్కరినీ ఫాలో కావడం లేదు.